Monday, October 28, 2019

కార్తీక పురాణము 1వ రోజు

కార్తీక పురాణము 1వ అధ్యాయము

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


కార్తీక మాహాత్త్యమును గురించి జనకుడు ప్రశ్నించుట


శ్లో!! ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతీ త్రయశ్శిఖాః
తస్మై తారాత్మనే మేథాదక్షిణామూర్తయే నమః !!


శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మండమండలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.
ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, "ఆర్యా! తమవలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగ గ్రహించినారము. కార్తీకమాస మాహాత్త్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరు చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది" అని కోరిరి.
అంత నా సూతమహర్షి "ఓ మునిపుంగవులారా! ఒకప్పుడు యిదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి - విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ, సాంబశివుడు పార్వతీదేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక, యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపు" డని యిట్లు చెప్పెను.
పుర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించు చుండగా పార్వతీదేవి " ప్రాణేశ్వరా సలలైశ్వర్యములు కలుగచేయునట్టిదీ, సకల మానవులూ వర్ణబేధములు లేక అచరించదగినదీ, శాస్త్ర సమ్మతమైనదీ, సూర్యచంద్రులున్నంత వరకూ నాచరింపబడెడిదీ యగు వ్రతమును వివరింపు" డని కోరెను. అంతట మహేశుడు మందహాస మొనరించి "దేవీ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దాని నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలానగరమువైపు" అని మిథిలానగరపు దెసగా చూపించెను.
అట, మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమరాకవల్ల నేనూ, నా శరీరమూ, నా దేశమూ, నా ప్రజలూ పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నాదేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను.
అందులకు వశిష్ఠుడు - జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి యిటు వచ్చితిని - అని పలుకగా జనకుడు "మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కాని, చిరకాలమునుండీ నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా యదృష్టము కొలదీ యీ యవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేల నంత పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమిటి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కర్తీక మాహాత్త్యమును గురించి వివరించవలసినది" యని ప్రార్థించెను.
వశిష్ఠమహాముని చిరునవ్వు నవ్వి, "రాజా! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులునూ ఆచరించదగినది సకల పాపహరమైనదీ అయి ఉన్నది. ఈ కార్తీకమాసము హరిహర స్వరూపము. ఈ మానమునందాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నానందదాయకమైనది. అంతియే గాక వినినంతమాత్రముననే యెట్టి నరకబాధలను లేక యిహమందునూ, పరమందునూ సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు" మని యిట్లు చెప్పసాగెను.
వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట:
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను యే వయస్సువాడైనను 'ఉచ్చ - నీచ' అనే భేదములేక కార్తీక మాసములో, సూర్యభగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మములును, దేవతాపూజలునూ చేసినచో - దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కర్తీకమాస ప్రారంభమునుండియు యిట్లు చేయుచూ, విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి "ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలయును.

_🌞*కార్తీక స్నానవిధానము*🌞_

ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకుని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృ దేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి, మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని,గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిధి ఆభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి, తనయింటి వద్దగాని, దేవాలయములలో గాని, లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందుగాని, విష్ణ్యాలయమందుగాని, లేక తులసికోటవద్దగాని, దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసినవారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ఇతి స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి మొదటి యధ్యాయము

మొదటి రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీక పురాణము - 2వ రోజు

కార్తీక పురాణము - 2వ అధ్యాయము

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


సోమవార వ్రత మహిమ

జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.
కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని ఏ జాతివారైనాగాని రోజంతయు వుపవాసముండి , నదీస్నానము చేసి తమశక్తి కొలదీ దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి యంతయూ జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలదీ పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేనివారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైననూ తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనము గాని యే విధమైన ఫలహారముగాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినయెడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక యితిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను. శ్రద్ధగా వినుము.

_*కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట :*_

పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ వుండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు 'స్వాతంత్ర్య నిష్ఠురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములూ, శాస్త్రములూ అభ్యసించినవాడై నందున సదాచారపరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గినవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడునూ యగుటచే లోకులెల్లరూ నతనిని 'అపరబ్రహ్మ ' అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ యింటినుండి వెడలగొట్టిరి. కాని, శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్ర మామొయం దభిమానము పోక, ఆమె యెంతటి నీచకార్యములు చేసిననూ సహించి, చీ పొమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమున కేవగించుకుని - ఆమెకు "కర్కశ" అనే ఎగతాళి పేరును పెట్టుటచే - అది మొదలందరూ దానిని "కర్కశా" అనియే పిలుస్తూ వుండేవారు.
ఇట్లు కొంతకాలము జరిగినపైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి యేకశయ్యపై తన భర్త గాఢనిద్రలో నున్న సమయమునుచూచి, మెల్లగాలేచి, తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలు గాని లేక, ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృతదేహమును యెవరి సహాయము అక్కరలేకనే, అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపోయి వూరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తాచెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె యింటికి వచ్చెను. ఇక తనకు యే యాటంకములు లేవని యింకా విచ్చలవిడిగా సంచరించుచు, తన సౌందర్యం చూపి యెందరినో క్రీగంటనే వశపరచుకుని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణసంకరురా లయ్యెను. అంతియే గాక పడుచుకన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తనమాటలతో చేరదీసి, వారిక్కూడా దుర్భుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జనకూడా చేయసాగెను.
జనకమహారాజా! యవ్వనబింకము యెంతో కాలముండదుగదా! కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికితోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమూ శరీరపటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధ పడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా యెన్నో విధాల తృప్తి కలిగించిన విటులు యే ఒక్కరూ యిపుడామెను తొంగిచూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన యెడల తమ నెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొగమైననూ చూడకుండిరి. కర్కశ యిటుల నరక బాధలనుభవించుచూ, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్లూ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్టురాలుగదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిదిలో నుంచగా, యమధర్మరాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింతకాదు. వెంటనే యీమెను తీసుకువెళ్లి యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను - యమభటూలామెను యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టిచంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లి దండ్రులకూ, అత్తమామలకూ యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ, చెవులలోనూ పోసి,యినుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమను నరకములో వేయగా, అందు యినుపముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు యేడు తరాలవాళ్లు అటు యేడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.
ఈ ప్రకారముగా నరకబాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మ యెత్తి, ఆకలి బాధపడలేక యిల్లిల్లూ తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ వుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్లుచేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున యీకుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్టుడైన అ విప్రుని పూజావిధానముచే జరిపించిన బలియన్నమగుటచేతనూ, ఆరోజు కార్తీకమాస సోమవారమగుటవలనను, కుక్క ఆరోజంతయు ఉపవాసముతో వుండుటవలననూ, శివపూజా పవిత్రస్థానమైన ఆ యింటదొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము ' అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల 'రక్షింపుము, రక్షింపుము' అని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నీవు ! నీ వృత్తాంతమేమి?'యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావా! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి, వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత, యమదూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల యీ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కర్తీక సోమవార వ్రతము చేసి యిచ్చట వుంచిన బలియన్నమును తినుటవలన నాకీజ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి యిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను" యని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము జేసి అక్కడివారందరూ చూచుచుండగనే యా విమానమెక్కి శివసాన్నిధ్యము కేగెను.
వింటివా జనక మహారాజా! కావున, నీవును ఈ కార్తీక సోమవారవ్రత మాచరించి, శివసాన్నిథ్యమును పొందు - మని వశిష్ఠులవారు హితబోధ చేసి, యింకనూ ఇట్లు చెప్పదొడంగిరి.

ఇతి స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి రెండవ అధ్యాయము

రెండవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీక పురాణం - 3 వ రోజు

కార్తీక పురాణం - 3 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్



కార్తీక స్నాన మహిమ

☘🌷☘🌷☘🌷☘🌷☘🌷☘
జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.
బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు,  తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.
వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.
ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.

*_ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహత్మ్యమందలి మూడవ అధ్యాయము

మూడవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: 

కార్తీక పురాణం - 4వ రోజు

కార్తీక పురాణం - 4వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


దీపారాధనా మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మహాతపస్వీ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివితీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడూ అని కోరగా, వశిష్టులవారు ఇట్లు
చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలమునొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్ధము శివాలయమున కానీ, విష్ణాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ, ప్రాకారమునందు కానీ
దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠప్రాప్తినొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి వుంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగా అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము.
శతృజిత్కథ
పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను ముని పుంగవుడొచ్చి 'పాంచాల రాజా! నీవు ఎందులకింతటి తపమాచరించుచున్నావు? నీ కోరికయేమి?' అని ప్రశ్నించగా, 'ఋషి పుంగవా! నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలు వున్ననూ, నా వంశము నిలుచుటకు పుత్రసంతానము లేక, కృంగి, కృశించి యీ తీర్థ స్థానమున తపమాచరించుచున్నానూ అని చెప్పెను. అంత మునిపుంగవుడు 'ఓయీ! కార్తీక మాసాన శివసన్నిధిన శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన యెడల నీ కోరిక నెరవేర గలదూ అని చెప్పి వెడలిపోయెను.
వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసము నెలరోజులూ శివాలయమున కార్తీక దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా,  వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ, విడువకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సావం చేయించి, బ్రాహ్మణులకు దానధరమములు జేసి, ఆ బాలునకు 'శతృజిత్తూ అని నామకరణం చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి.
కార్తీకమాస దీపారాధన వలన పుత్రసంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శతృజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తి సాము మొదలుగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచూ, ఎదిరించిన వారిని దండించుచూ, తన కామవాంఛ తీర్చుకొనుచుండెను.
తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూసీచూడనట్లు, వినీవిననట్టు ఉండిరి. శతృజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుజెప్పు వారను నరుకుదునని కత్తిపట్టుకొని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేస్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామ వాంఛ తెలియజేసెను. ఆమె కూడా ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయి బట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని బోయి భోగములను అనుబవించెను.
ఇట్లొకరికొకరు ప్రేమపరవశులగుట చేత వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచూ తమ కామ వాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి భార్యను, రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.
ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును గదా, అని రాజకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మాహానందముతో రతిక్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను.
వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలన, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులనిరువురినీ తీసుకొనిపోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? విచిత్రముగా వున్నదే!' అని ప్రశ్నించేను.
అంత యమకింకరులు 'ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, ఈ పవిత్రదినమున, అనగా, కార్తీక పౌర్ణమి, సోమవారపు దినమున, తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారూ అని చెప్పగా యీ సంభాషణంతయు వినుచున్న రాజ కుమారుడు 'అలా ఎన్నటికినీ జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణునికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యమునకు జేర్చిరి.
వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవుటయే గాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు.


ఇతి స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి నాల్గవ అధ్యాయము

నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీక పురాణం - 5వ రోజు

కార్తీక పురాణం - 5వ అధ్యాయము

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

వనభోజన మహత్యం

వశిష్టుడు తిరిగి జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు గాని విష్ణాలయము నందు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసినవారి సర్వ పాపములును నివృతియగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంత వరకు పఠించిన వారికీ విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైననూ కంఠస్థం చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరి కాయలతో నిండిఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణకాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మంపోయి నిజ రూపం కలిగింది” అని చెప్పారు. అది విన్న జనకుడు ”ముని వర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు…

_*🐀కిరాతుడు, ఎలుకలకు మోక్షం🐀*_

రాజా! కావేరి నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకో కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సహవాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి ”బిడ్డా…! నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకొంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి, సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది” అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖంగా… ”స్నానం చేస్తే మురికి పోతుంది. అంతే…! దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్లో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా?” అని ఎదురు ప్రశ్నలు వేశాడు.
దాంతో ఆ బ్రాహ్మడు ”ఓరీ నీచుడా! కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు. నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావిచెట్టు తొర్రలో ఎలుక రూపంలో బదుకుదువుగాక” అని శపించాడు. ఆ శాపంతో గజగజా వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి… ”నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవకార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాపవిమోచనం చెప్పండి” అని కోరాడు. అంతట ఆయన ”బిడ్డా! నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్నా.. కార్తీక మహత్యాన్ని వింటే నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు” అని ఊరడించాడు.
తండ్రి శాపంతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి, అడవికి పోయి, చెట్టు తొర్రలో నివసిస్తూ, పండ్లు తింటూ బతకసాగాడు. కావేరీ నదీతీరాన ఉన్న రావిచెట్టు తొర్రలో అతను నివాసమేర్పరుచుకోవడం వల్ల నదీస్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణగాథల్ని చెప్పుకొనేవారు. కార్తీకమాసంలో ఒకానొకరోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావిచెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీకపురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. రుషిదగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు.
అంతలో ఒక కిరాతకుడు చెట్టుకింద ఉన్నవారిని దూరం నుంచి చూసి ”ఓహో… ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బేడబ్బు” ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు. ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి ”మహానుభావులారా…! మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకించిపోతోంది” అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు ”ఓ కిరాతకా! మేం కావేరీ నదీ స్నానమాచరించేందుకు ఇక్కడకొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వుకూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు” అన్నారు.
అటు ఎలుక, ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా… కిరాతకుడికి తన పూర్వజన్మ వృంతాతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత రుషులకు దండం పెట్టి, సాష్టాంగం చేసి, వెళ్లిపోయాడు. ఎలుక కూడా పురాణమంతా వినడం, చెట్టుకింద దొరికిన ఫలాలను బుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుంచి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో ”మునివర్యా! ధన్యుడనయ్యాను. మీ వల్ల నేను మూషిక రూపం నంచి విముక్తి పొందాను” అని తన వృత్తాంతమంతా చెప్పాడు.
”కాబట్టి జనకమహారాజా…! ఈ లోకంలో సిరిసంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి, ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమాచరించాలి” అని వివరించారు.

ఇతి స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఐదవ అధ్యాయము

ఐదవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీక పురాణం - 6 రోజు

కార్తీక పురాణం - 6వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


దీపారాధన విధి, మహత్యం


తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నాడు. ”ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా రోజూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో… వాడు అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఎవరైతే కార్తీకమాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో… వారికి కైవల్యం ప్రాప్తిస్త్తుంది. దీంతోపాటు దీపదానం కూడా ఈ నెలలో పుణ్యలోకాలను కలుగజేస్తుంది. దీపదానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా పత్తిని తీసి, శుభ్రపరిచి, వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి, వత్తులు అందులో వేసి, నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆ ప్రమిదను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శక్తికొలది దక్షిణ సైతం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ… కార్తీక మాసం ఆఖరిరోజున వెండితో చేసిన ప్రమిదలో, బంగారంతో వత్తిని చేయించి, ఆవునెయ్యిపోసి దీపం వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజూ ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో… వెండి ప్రమిదను సైతం చివరిరోజు అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకలైశ్వర్యములు పొందడమే కాకుండా, మరణానంతరం మోక్షాన్ని పొందగలరు” అని వివరించారు. దీపారాదన సమయంలో కింది స్త్రోత్రాన్ని పఠించాలి.

*శ్లో|| సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు ఖవాహం*
*దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తూ సదామమ||*
అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునదియు, సకల సంపదలు నిచ్చునది యగును ఈ దీపారాదనము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!” అని పై శ్లోకానికి అర్థం. దీపదానం తంతు పూర్తయ్యాక బ్రాహ్మణ సమారాధన చేయాలి. అంత శక్తిలేనివారు కనీసం పదిమంది బ్రాహ్మణులను భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. పురుషులుగాని, స్త్రీలుగాని ఎవరైనా ఈ దీపదానం చేయవచ్చు. ఇది సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగిన సుఖాలను అందజేస్తుంది. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది” అంటూ వశిష్టులవారు ఇలా చెబుతున్నారు.

_*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*_

పూర్వ కాలమున ద్రావిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉంది. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. దీంతో ఆమె ఇల్లుల్లూ తిరిగి, పాచిపని చేస్తూ జీవనం గడపసాగింది. తాను పనిచేసే ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది. ఏమైనా మిగిలినా, ఎవరైనా వస్తువులిచ్చినా… దాన్ని ఇతరులకు విక్రయించి, సొమ్ము కూడబెట్టుకునేది. ఆ విధంగా కూడబెట్టిన మొత్తాన్ని వడ్డీలకు ఇస్తుండేది. అయితే ఆమెకు దైవభక్తి అనేది లేదు. ఒక్కదినమైననూ ఉపవాసమున్న దాఖలాలు లేవు. దేవుడిని మనసారా ధ్యానించి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి, అవహేళన చేసేది. ఏనాడు బిక్షగాడికి పిడికెడు బియ్యం పెట్టక, తనూ తినక ధనాన్ని కూడబెట్టసాగింది.
అలా కొంతకాలం గడిచింది. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించేందుకు బయలుదేరి, మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అక్కడొక సత్రంలో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామ మంచిచెడులు తెలుసుకుంటూ… ఆ స్త్రీని గురించి తెలుసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి ”అమ్మా… నా మాటలు విను. నీకు కోపం వచ్చినా సరే. నేను చెబుతున్న మాటల్ని ఆలకించు. మన శరీరాలు శాశ్వతాలు కాదు. నీటి బుడగల వంటివి. ఏ క్షణంలోనైనా పుటుక్కుమనొచ్చు. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు, సప్తధాతువులతో నిర్మితమైన ఈ శరీరంలో ప్రాణం, జీవం పోగానే చర్మం, మాంసం కుళ్లిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది. అలాంటి శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. బాగా ఆలోచించు. అగ్నిని చూసిన మిడత అది తినే వస్తువు అనుకుని, ఉత్సాహంగా వెళ్తుంది. కానీ, దగ్గరకు వెళ్లే వరకు తెలియదు. అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది. ఆ మిడత బూడిదవుతుంది. మనుషులు కూడా అలాగే ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారంలోపడి నశిస్తున్నారు. కాబట్టి నామాట విను. ఇప్పటికైనా నువ్వు సంపాదించినదాంట్లో కొంత దానధర్మాలు చేసి, పుణ్యాన్ని సంపాదించు. ప్రతిరోజూ శ్రీమన్నారాయుణుడిని స్మరించు. వ్రతాలు చేయి. మోక్షాన్ని పొందవచ్చు. నీ పాప పిరహారార్థంగా వచ్చే కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించు. రోజూ ఉదయాన్నే నిద్రలేచి, సాన్నమాచరించి, దాన ధర్మాలతో బ్రాహ్మణులను సంతుష్టపరుచు. నువ్వు ముక్తిని పొందగలవు” అని సూచించాడు.
ఆ బ్రాహ్మడు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్న ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకుని, దానధర్మాలను చేస్తూ… కార్తీక వ్రతం ఆచరించింది. ప్రతిరోజూ దీపారాధన చేయడంతోపాటు, యథాశక్తి దీపదానం చేసింది. దీంతో ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. ”కాబట్టి రాజా… కార్తీక మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. ప్రతి కార్యం మోక్షదాయకమే” అని జనకుడు తెలిపాడు.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఆరవ అధ్యాయము

ఆరవ రోజు పారాయణము సమాప్తము.
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


కార్తీకపురాణం - 7వ రోజు

కార్తీకపురాణం - 7 అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


శివకేశవార్చన విధులు

కార్తీకమాసానికి సంబంధించి వశిష్టులవారు జనకమహారాజుకు ఇంకా ఇలా చెబుతున్నారు…
”ఓ రాజా! కార్తీక మాసం, దాని మహత్యం గురించి ఎంత తెలిసినా… ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించినవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీదళాలతోగానీ, సంహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద సాలగ్రామం పెట్టి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగును. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకింద భోజనం పెట్టి, తను తినిన సర్వపాపాలు తొలగిపోవును.
కార్తీకమాసంలో దీపారాధనకూ ప్రత్యేక స్థానముందని ఇదివరకే చెప్పాను. అయితే అలా రోజూ దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసినా… వారి పాపాలు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన చేయించినట్లయితే… వారికి అశ్వమేథ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంతే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. శివాలయానికి గానీ, విష్ణువు ఆలయానికి గానీ జంఢా ప్రతిష్టించాలి. అలా చేసినవారి దరిని కూడా యమ కింకరులు సమీపించలేరు. కోటి పాపాలైనా… సుడిగాలిలా కొట్టుకుపోతాయి.
ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి, వరిపిండితో శంఖు చక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి, వాటిపై నిండా నువ్వుల నూనె పోసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్లు ఆరకుండా చూడాలి. దీనినే నంద దీపం అంటారు. ఈ విధంగా చేసి, నైవేద్యం పెడుతూ… కార్తీకపురాణం చదివినట్లయితే.. హరిహరులు ఇద్దరూ సంతసిస్తారు. అలా చేసిన వ్యక్తి కైవల్యం పొందుతాడు. అందుకే కార్తీకమాసంలో శివుడిని జిల్లేడుపూలతో అర్చిస్తారు. దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యం గంధం పట్టించి, తులసిదళంతో పూజించాలి. ఏ మనిషీ ధనబలం కలిగి ఉంటాడో… అతను ఆ మాసంలో పూజాదులు చేయడో… అతను మరుజన్మలో కుక్కలా పుట్టి, తిండి దొరక్క ఇంటింటికీ తిరిగి, కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో మరణాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీకమాసంలో నెలరోజులై పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా చేస్తే… అవి విశకేశవులను పూజించిన ఫలితాన్నిస్తుంది. అందుకే ఓ మహారాజ… నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు” అని చెప్పారు.
”నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం”

ఇతి స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏడవ అధ్యాయము

ఏడవ రోజు పారాయణము సమాప్తము


కార్తీకపురాణం-8 వ రోజు

కార్తీకపురాణం-8 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


హరినామస్మరణం

వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు.
అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.

🙏_*ఆజా మీళుని కథ_*🙏

పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.
కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం” అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ”అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. ”’సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.

ఇతి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం,

ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం - 9వ రోజు

కార్తీకపురాణం - 9వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


విష్ణు దూతలు-యమదూతల వివాదం


అజామీళుడిని తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వాదానికి దిగారు. విష్ణుదూతలిలా అంటున్నారు… ”ఓయీ యమదూతలారా. మేం విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువైన యముడు ఎవరిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు?” అని ప్రశ్నించారు. దానికి వారు ”ఓ విష్ణుదూతలారా… మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి, ప్రతిరోజూ మా ప్రభువుకు విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి, ఆ మనిషి అవసానదశలో మమ్మల్ని పంపుతారు” అని చెప్పుకొచ్చారు.
పాపుల గురించి విష్ణుదూతలకు యమదూతలు ఇలా వివరిస్తున్నారు… ”అయ్యా… అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపాలు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను- కుల వృతిని తిట్టి హింసించు వారు, జీవ హింస చేయు వారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులు, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమ ధర్మరాజు గారి ఆజ్ఞ” అని చెప్పుకొచ్చారు.
తమ సంవాదానిన కొనసాగిస్తూ… ”ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారాలకు లోనై, కులభ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడి ప్రవర్తించాడు. వావి వరసలు లేకుండా కూతురువరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు?” అని ప్రశ్నించగా… విష్ణుదూతలిలా చెబుతున్నారు. ”ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు సూక్షధర్మాలు తెలియవు. ధర్మసూక్షాలు ఎలా ఉంటాయో చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు- అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, అనాథ ప్రేత సంస్కాములు చేయువారు, తులసి వనము పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివ కేశవులను పూజించు వారు, సదా హరి నామ స్మరణ చేయువారు, మరణ కాలమందు ‘నారాయణా’యని శ్రీహరిని గాని, ‘శివ’ అని ఆ పరమశివుని గాని స్మరించు వారు, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’అని పలికాడు” అందుకే విష్ణుసాన్నిద్ధ్యానికి అతను అన్నివిధాలా అర్హుడు” అని వివరించారు.
అజామీళుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది. ”ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో ‘నారాయణా’ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది” అని పలుకుతూ… సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లడు.
”కాబట్టి ఓ జనక మహారాజా! తెలిసిగానీ, తెలియక గానీ నిప్పును ముట్టినప్పుడు బొబ్బలెక్కడం, బాధకలగడం ఎంత నిజమో… శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారనడం అంతే కద్దు” అని వివరించారు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి నవమధ్యాయ:

తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీక పురాణం 10వ రోజు

కార్తీక పురాణం 10వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


అజామీళుని జన్మ వృత్తాంతం

అజామీళుని వృత్తాంతమంతా విన్న జనక మహారాజు వశిష్టుడితో ఇలా అడుగుతున్నారు… ”ఓ మహానుభావా.. అజామీళుడు ఎంతటి నీచుడైనా అంత్యకాలాన నారాయణ మంత్ర పఠనంతో విష్ణుసాన్నిధ్యాన్ని పొందిన తీరును చక్కగా వివరించారు. అయితే నాకో చిన్న సంశయం. గత జన్మ కర్మ బంధాలు ఈ జన్మలో వెంటాడుతాయన్నట్లు అజామీళుడు కూడా గత జన్మలో చేసుకున్న కర్మలే ఆయనకు మోక్షాన్ని కల్పించాయా?” అని ప్రశ్నించారు.. దానికి మునివర్యులు ”ఓ జనక మహారాజా! నీకు వచ్చిన సందేహమే యమదూతలకు కూడా వచ్చింది. ఆ వృత్తాంతం… అజామీళుడి జన్మ వృత్తాంతం చెబుతాను విను” అని ఇలా చెప్పసాగారు…
అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లాక యమ కింకరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు. ”ప్రభూ! మీ ఆజ్ఞ ప్రకారం అజామీళుడిని తీసుకొచ్చేందుకు వెళ్లాం. అక్కడకు విష్ణుదూతలు వచ్చి, మాతో వాదించి అతన్ని పట్టుకెళ్లారు. చేసేది లేక మేము వట్టిచేతులతో తిరిగి వచ్చాం” అని భయకంపితులై విన్నవించుకున్నారు.
”అరెరె…! ఎంత పని జరిగింది? ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే? దీనికి బలమైన కారణం ఉండొచ్చు” అని తన దివ్యదృష్టితో అజామీళుడి పూర్వజన్మ వృత్తాతం తెలుసుకున్నాడు. ”ఆహా…! అదీ సంగతి. నారాయణ మంత్రంతో అతను విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడు” అని అతని పూర్వజన్మ వృత్తాతం చెప్పసాగాడు.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతను అపురైపమైన అందం, సిరిసంపదలు, బలగర్వంతో శవారాధన చేయకుండా ఆలయానికి వచ్చే ధనాన్ని దొంగతనం చేస్తుండేవాడు. శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా, దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కోసారి శివుడికెదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు.
అతనికి ఓ పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడంది. ఆమె కూడా అందమైనది కావడంతో ఆమె భర్త చూసీచూడనట్లు వ్యవహరించేవాడు. అతను భిక్షాటనకు ఊరూరూ తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి, యాచన చేసిన బియ్యం, కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసటతో… ”నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది. త్వరగా వంటచేసి, వడ్డించు” అని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు చీదరించుకుని, నిర్లక్ష్యంతో కాళ్లు కడుగుకొనేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. తన ప్రియుడిపై మనస్సుగలదై భర్తను నిర్లక్ష్యం చేసింది. ఇది భర్త కోపానికి దారి తీసింది. దీంతో అతను కోపంతో ఓ కర్రతో బాదాడు. ఆమె ఆ కర్రను లాక్కొని, భర్తను రెండింతలు ఎక్కువ కొట్టి, ఇంటి బయట పారేసి, తలుపులు మూసేసింది. అతను చేసేదిలేక, భార్యపై విసుగు చెంది, దేశాటనకు వెళ్లిపోయాడు. భర్త ఇంటినుంచి వెళ్లిపోవడంతో సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుమీద కూర్చుంది.
అటుగా వెళ్తున్న ఓ రజకుడిని పిలిచి… ”ఓయీ… నువ్వు ఈ రాత్రికి నా దగ్గరకు రా. నా కోరిక తీర్చు” అని కోరింది. దానికి అతను ”అమ్మా! నువ్వు బ్రాహ్మణ పడతివి. నేను రజకుడిని. మీరు అలా చేయడం ధర్మం కాదు. నేను ఆ పాపపు పనిని చేయలేదు” అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ రజకుడి అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, ఆ గ్రామ శివార్చకుడి (అజామీళుడి పూర్వజన్మ) దగ్గరకు వెళ్లింది. వయ్యారాలు వలుకబోస్తూ… తన కామవాంఛ తీర్చమని పరిపరివిధాలా బతిమాలింది. ఆ రాత్రంతా అతనితో గడిపింది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి… ”అయ్యో! నేనెంతటి పాపానికి ఒడిగట్టాను? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను వెళ్లగొట్టి, క్షణికమైన కామవాంఛకు లోనై… మహాపరాధం చేశాను” అని పశ్చాత్తాపపడింది. ఒక కూలీవాడిని పిలిచి, కొంత ధనమిచ్చి, తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది. కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ఇంటికి తిరిగిరాగా… పాదాలపై పడి తన తప్పులను క్షమించమని వేడుకుంది. అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త అనురాగాలను సంపాదించింది.
కొంతకాలానికి ఆమెతో కామక్రీడలో పాల్గొన్న శివార్చకుడు వింత వ్యాధితో రోజురోజుకీ క్షీణిస్తూ మరణించాడు. అతను రౌరవాది నరకాల బారిన పడి, అనేక బాధలు అనుభవించి, మళ్లీ నరజన్మ ఎత్తాడు. సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముని కొడుకుగా పుట్టాడు. గత జన్మలో ఆ బ్రాహ్మణుడు చేసిన కార్తీక స్నానాల వల్ల అతనికి తిరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తించింది. అతనే అజామీళుడు. ఇక ఆ బ్రాహ్మణ మహిళకూడా కొంతకాలానికి చనిపోయి, అనేక నరకబాధలు అనుభవించింది. ఆ తర్వాత ఓ హరిజనుడి ఇంట పుట్టింది. ఆమె జాతకం ప్రకారం తండ్రికి గండం ఉందని తేలడంతో… అతను ఆమెను అడవిలో వదలగా… అక్కడ ఒక ఎరుకలవాడు ఆమెను పెంచాడు. ఆ అమ్మాయే పెరిగి, పెద్దదై అజామీళుడిని మోహించింది. కులాలు వేరుకావడంతో కులసంకరం చేసి, ఇద్దరూ కలిసిపోయారు. అజామీళుడు ఈ జన్మలో కులసంకరం చేసినా… కేవలం అంత్యకాలాన నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని యమధర్మరాజు యమభటులకు వివరించిన తీరును జనక మహారాజుకు వశిష్టుడు చెప్పెను.

ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదవ అధ్యాయము

పదవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 11వ రోజు

కార్తీకపురాణం 11వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్



మంథరుడు - పురాణ మహిమ


తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…
పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.
మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.
ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.
మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది.
ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ” ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.
విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.
”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.

ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదకొండొవ అధ్యాయము

పదకొండొవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 12 వ రోజు

కార్తీకపురాణం 12 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


ద్వాదశి ప్రశంస, సాలగ్రామదాన మహిమ.

వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను…” అని ఈ విధంగా చెప్పసాగాడు.
”కార్తిక సోమవారం రోజు పొద్దున్నే నిద్రలేచి, రోజువారీ విధులు నిర్వర్తించుకుని, నదికి వెళ్లి, స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తికొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి, ఆరోజంతా ఉపవాసముండాలి. సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణువాలయానికి గానీ వెళ్లి, పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి సకల సంపదలు కలగడమే కాకుండా, మోక్షం లభిస్తుంది.
కార్తిక మాసంలో శనిత్రయోదశి గనక వస్తే… ఆ వ్రతం ఆచరిస్తే నూరు రెట్ల ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్లి, శ్రీహరిని మనసారా ధ్యానించి, ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి, మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే.. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసినవారు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే… కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినదానికంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి, ఆ రోజు విష్ణువుకు అమిత ఇష్టమైన రోజు. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే… ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయ… అన్నేళ్లు వారు ఇంద్రలోక ప్రాప్తి పొందగలరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవునేతిని పోసి, దీపముంచిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు. ద్వాదశిరోజు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చినవారు ఇహపర లోకాల్లో సుఖాలను పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది. చెబుతాను… శ్రద్ధగా ఆలకించు….” అని ఇలా చెప్పసాగాడు.
సాలగ్రామ దాన మహిమ
పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక వైశ్యుడు నివసించేవాడు. వాడు దురాశపరుడై, నిత్యం డబ్బుగురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా, బీదలకు అన్నదానం, ధర్మాలు చేయకుండా, ఎప్పుడూ పర నిందలతో కాలం గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడినని విర్రవీగుచుండేవాడు. పరుల ధనం ఎలా అపహరించాలా? అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు.
అతడొకరోజు తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంత కాలానికి తన సొమ్ము అడగగా… ఆ బ్రాహ్మణుడు ”అయ్యా! మీకు రావాల్సిన మొత్తాన్ని నెలరోజుల్లో ఇస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మలో కాకున్నా… వచ్చే జన్మలో ఒక జంతువుగా పుట్టి అయినా… మీ రుణం తీర్చుకుంటాను” అని వేడుకొన్నాడు. దానికి ఆ వైశ్యుడు ”అలా వీల్లేదు. ఇప్పుడు నా సొమ్ము నాకిచ్చేయి. లేకపోతే నీ తలను నరికి ఇవ్వు” అని ఆవేశం కొద్దీ వెనకా ముందూ వెనకా ఆలోచించకుండా కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుకను కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు భయపడి, అక్కడే ఉన్న రాజభటులు పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కాబట్టి, అప్పటి నుంచి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యాపాపం ఆవహించింది. కుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి, రౌరవాది నరక కూపాల్లో పారేశారు.
ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు. పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించడం, బావులు, చెరువులు తవ్వించడం చేశాడు. సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా… కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి, భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్లాడు. ధర్మవీరుడు నారదమహర్షిని సాదరంగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. చేతులు జోడించి ”ఓ మహానుభావా…! నా పుణ్యం కొద్ది నాకు మీ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి” అని వేడుకొన్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వుతూ… ”ఓ ధర్మవీరా! నేను నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినా… అత్యంత ఫలం కలుగుతాయి. నాలుగు జాతులలో ఏ జాతివారైనా… స్త్రీ పురుషులనే బేదం లేకుండా… దొంగ అయినా, దొర అయినా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా… కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులా రాశిలో ఉండగా… నిష్టతో ఉపవాసముండాలి. సాలగ్రామదానం చేయాలి. అలా చేసినవారు తండ్రి రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల కిందటి జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్దరించేందుకు నీవు సాలగ్రామదానం చేయక తప్పదు.” అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు నారదమహామునితో… ”మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసినా నా తండ్రి మోక్షాన్ని పొందకుండా నరకానికి వెళ్లినప్పుడు… ఈ సాలగ్రామ దానం చేస్తే ఆయన ఎలా ఉద్దరింపబడతాడు?” అని చెప్పాడు. అతని అవివేకానికి విచారించిన నారదుడు ఇలా చెబుతున్నాడు ”ఓ వైశ్యుడా! సాలగ్రామం శిలామాత్రమే అనుకుంటున్నావా? అది శిలకాదు. శ్రీహరి రూపం. అన్ని దానాల్లో సాలగ్రామదానం వల్ల కలిగే ఫలం గొప్పది. నీ తండ్రి నరక బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు. మరో మార్గం లేదు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ధర్మవీరుడు ధనబలంతో సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతను ఏడు జన్మలు పులిగా, మూడు జన్మలు కోతిగా, అయిదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు స్త్రీగా పుట్టాడు. ఆ తర్వాత పది జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ పేదబ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవ్వగానే… ఓ విధ్వంసుడికి ఇచ్చి పెండ్లి చేశారు. పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి. తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దు:ఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృష్టిని ఉపయోగించాడు. ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం చేయించాడు. ”నాకు బాలవైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపాం నశించుగాక” అని సాలగ్రామ దానఫలాన్ని ధారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల దాని ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో ఆమె మరో బ్రాహ్మడి ఇంట్లో కుమారుడిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందాడు.
”కాబట్టి ఓ జనక మహారాజా! శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినట్లయితే… ఆ ఫలితం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు” అని సెలవిచ్చాడు.

ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పన్నెండవ అధ్యాయము

పన్నెండవ రోజు పారాయణము సమాప్తము.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం - 13 వ రోజు

కార్తీకపురాణం - 13 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


కన్యాదాన ఫలం, సువీరచరిత్రము


తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

_*సువీర చరితం*_

పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు.
అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు.
ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి?”అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు.
అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు.  అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా?” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు.
వినయంగా ఇలా చెబుతున్నాడు… ”ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.
శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.
”ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:

పదమూడో రోజు పారాయణం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 14 వ రోజు

కార్తీకపురాణం 14 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

ఆబోతుకు అచ్చువేసి వదులుట

మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
కార్తీకమాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||
”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.
కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి
2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి
4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.

ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తం

పద్నాలుగో రోజు పారాయణం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 15 వ రోజు

కార్తీకపురాణం 15 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

దీప ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి


తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.
”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను…
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.
చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.
స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణ కార్తీకపురాణం 15వ అధ్యాయం : దీప ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి

తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను.
”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను…
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.
చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.

స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణయం
15వ రోజు పారాయణం సమాప్తం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 16వ రోజు

కార్తీకపురాణం 16వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

స్తంభదీప ప్రశంస

తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు… ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో… అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీస్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే… చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.
సంతానం ఉన్నవారు ఇలా చేస్తే… వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిదాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది… చెబుతాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగాడు….
దీపస్తంభం.. విప్రుడగుట
రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి… ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు. అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో ”ఫళఫలా”మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా… వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ… నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.
దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పెరుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు.
ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది?
అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభానికి
ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా… ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు… ”ఓ మునులారా…! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించారు. అంత అక్కడున్న మునులంతా… తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ…! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.

ఇది స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్యమందలి పదహారో అధ్యాయం

పదహారో రోజు పారాయణం సమాప్తం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం - 17వ రోజు

కార్తీకపురాణం - 17వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం


సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్



ధనలోభికి తత్వోపదేశం

అప్పుడు ఆంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. ”ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు.
”కర్మల వల్ల ఆత్మ దేహదారణ సంభవిస్తున్నది. కాబట్టి, శారీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు.
అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు ”ఈ దేహం అంత్ణకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఎదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తాదశాధ్యాయం

పదిహేడవ రోజు పారాయణ సమాప్తం

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్

కార్తీకపురాణం 18 వ రోజు

కార్తీకపురాణం 18 వ అధ్యాయం

మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం


సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్


సత్కర్మనుష్టాన ఫల ప్రభావం

ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు…. ”ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి-గురువు-అన్న-దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్యమూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే… అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు.
దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు… ”ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పసాగెను…
”ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడేజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలనాచరించినా, అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా… వైశాక మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా… మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా… అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాత:కాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాత:కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయస్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెలగానీ, వేదాలతో సరితూగే శాస్త్రంగానీ, గంగాగోదావరులకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను.
దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నిస్తున్నాడు…. ”ఓ మునిశ్రేష్టా…! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు…” అని కోరాడు.
ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు…. ”ఓయీ…! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు, మహాలక్ష్మీదేవితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా… ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.
తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా… ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటిసూర్యప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి… ఏమి తెలియనివాడిలా మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా… ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా… నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ, అవి పూర్తికాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను.
జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది, లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షుఉలున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు, అతను ముసలిరూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకుండిరి. గర్విష్టులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…

*శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!*
*విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!*
*లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!*
*వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||*

*శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం*
*దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం*
*శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం*
*త్వాం త్రైలోక్య కుటుంబినిం శర సిజాం వందే ముకుంద ప్రియం||*

ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం

పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.

సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్