Tuesday, December 29, 2020

పాశురము - 20వ రోజు

 తిరుప్పావై --- 20 పాశురం

ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు

కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్

శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు

వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్


శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్

నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్

ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై

ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్


రాగం: పూరీ కళ్యాణి


ముప్పది మూడు సురకోటుల ముప్పుగాచి

భయమును మానుపు బలశాలీ! మేలుకో!

అర్జవముతో ఆశ్రితులను బ్రోచు

అరిభయంకరా! హరీ! మేలుకో! //ముప్పది//


పూర్ణా! నప్పిన్నా! సిరీ! మేలుకో! మమ్మేలుకో!

ఆలవట్టము, అద్దమొసగీ అందరినీ

నీ స్వామితో నీరాట్ట మాడింపవే అమ్మా!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఈ తిరుప్పావై పాశురాలలోని విషయాలను మనం మూడు చోట్ల అన్వయించుకోవాలి. ఒకటి రేపల్లెలో కృష్ణుడు, గోపికలతో, రెండు శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవి, శ్రీరంగనాధుడు. మూడోది మనలో. ఈ పాశురాలలోని అసలు అంతరార్ధం అన్ని యుగాలలో అందరికీ ఉపయుక్తమైనవే.. నిన్న గోఫికలు వచ్చి ఎన్ని నిష్టూరాలు చేసినా నీలాదేవి, శ్రీకృష్ణుడు నిద్ర లేవలేదు. ఈ రోజు గోపికలు ఇద్దరినీ ఒకేసారి స్తుతిస్తున్నారు.


"ముప్పై మూడు కోట్ల దేవతలకు ఎటువంటి కష్టం కలగకముందే వెళ్లి యుద్ధభూమిలో వారికి ముందుగా నిలిచి పోరాడి శత్రుభయాన్ని తొలగించే బలశాలి.. రక్షించేవాడా! నిన్ను ఆశ్రయించినవారి శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భాయాన్ని పుట్టించేవాడా! నిర్మల స్వభావుడా! మేలుకో.. బంగారు కలశాల్లాంటి స్తనాలు కలిగి, దొండపండులాంటి ఎర్రని పెదవులు, సన్నని నడుము గల ఓ నీలాదేవి! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలవైనదానా! మేలుకో. ఆ విసనకర్రను, కంచుటద్దాన్ని మాకు ఇచ్చి నీ సఖుడు శ్రీకృష్ణుడిని మాతో స్నానమాడించు" అని అర్ధించారు.


మనకు ముప్పై మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని నానుడి కాని వేదాల ప్రకారం వర్గరీత్యా ఉన్నది ముప్పై ముగ్గురే. ఎనిమిదిమంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండుమంది ఆదిత్యులు, ఇద్దరు అశ్విని దేవతలు, మొత్తం ముప్పైమూడు వర్గాల దేవతలు. వారందరూ దేవతలైనా కూడా తమ కష్టాలను పోగొట్టుకోవడానికి పరమాత్మనే ఆశ్రయిస్తారు..”స్వామి నీవు మనసు, మాట, చేత కలిగినవాడవు. మనసులో అనుకున్నది మాటల్లో చెప్పడం, మాటల్లో చెప్పింది చేతల్లో చేయడం నీకు అలవాటు. మరి ఇవాళ ఉషోదయ వేళలో మమ్మల్ని కలుస్తానని నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకో. నీలాదేవి స్థనములు స్వామిని ఆకర్షిస్తాయి అంటే వక్షస్థానంలో జన్మించే పరమ భక్తులే ఆ స్వామిని ఆకర్షిస్తారు. ఆమె నాజూకైన నడుము అనగ వైరాగ్యం కూడా ఆతనికి ఆకర్షణీయం. అధరాలు పర, పరమ భక్తికి నిదర్శనాలు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము స్వామిని చేరడానికి గల దారులు. అమ్మా! నీలాదేవి నీవు ఉన్నతమైన స్త్రీవి. సాక్షాత్తు ఆ స్రీమహాలక్ష్మివే. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న నీవే ఇలా నిద్రించడం తగదమ్మా!" అని వేడుకుంటున్నారు గోపికలు.


శ్రీ అంటే జీవులచే ఆశ్రయింపబడి ఎల్లప్పుడు స్వామిని ఆశ్రయించి ఉండేది. వాత్సల్యము, కారుణ్యము, క్షమ, మార్దవము మొదలైన సుగుణాలు ఉన్న పరిపూర్ణురాలు. అమ్మా! విసనకర్రను, అద్దాన్ని మాకిచ్చి నీ విభునితో మేము స్నానమాడునట్లు చేయి. ఇదే మా కోరిక. విసనకర్ర, అద్దం వీరి వ్రతానికి కావలసిన వస్తువులు. కాని ఒక భార్యను ఆమె భర్తతో తమను స్నానం చేయించడానికి పంపమనడం ఎబ్బెట్టుగా అనిపించినా జీవులను పరమాత్రంతో చేర్చడం అనేది అసలు అర్ధం.పరమాత్మ అనే కొలనులో స్నానం లేదా అనుగ్రహం పొందడానికి సాయం చేసేదే శ్రీ లేదా అమ్మ. మన ఆత్మలకు బాధను కలిగించే అహంకార మమకారాలు అనే చెమటను తొలగించడానికి ఉపయోగపడేది నమః అనే వీవెన. అప్పుడు నీవు, నేను అనే భావన లేక సర్వమూ ఆ భగవంతుడే అనిపిస్తుంది. మన ఆత్మ స్వరూపాన్ని చూసుకోవడానికి ఉపయోగించే ప్రణవ (ఓం) మంత్రమే ఈ కంచుటద్దం. పరమాత్మకు నిత్యం సేవ చేసుకునే భాగ్యాన్ని పొందాలని ఆ గోపికలు అమ్మవారిని ప్రార్ధిస్తున్నారు.

పాశురము - 19వ రోజు

 తిరుప్పావై --- 19 పాశురం


కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్

మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి

కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్

వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్

మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై

ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్

ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్

తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: అమీర్ కళ్యాణి


గుత్తు దీపాలు వెలుగ పట్టెమంచము పైని

పంచ శయనమ్ముపై పూల గుత్తుల నీల

ఎదను ఎదనుంచిన దేవా! పలుకవా! //గుత్తు దీపాలు //

కాటుక కన్నుల కలికిరో నీవు

నీ పతిని క్షణమైన మేలుకోనీవా?

ఎడబాటు సుంతైన ఓపలేకున్నావ?

నీ స్వరూపానికి నీ స్వభావానికి

ఇది తగదు తగదమ్మ తలుపు తీయమ్మా!

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..


ఇది భగవంతుని తత్వ నిరూపణ చేసే శృంగార పాశురము. సృష్టికి ముందు తర్వాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడై ఉంటాడు. శ్రీమన్నారాయణ తత్వము ఏక అనేకములైనది. శ్రీని గాని, నారాయణుని గాని వేరువేరుగా భావించకుండా వాళ్లిద్దరే ఈ జగత్తుకు మూలాధారాలు అని ఈ పాశురంలో ఇద్దరినీ మేల్కొల్పుతున్నారు.


"ఓ కృష్ణా! నీది విశాలమైన హృదయం కదా! నోరు తెరిచి మాతో మాట్లాడడం లేదెందుకని? నీవు మా నీలాదేవితో కలిసి దంతపుకోళ్ల మంచం మీద పంచశయనంపై హాయిగా నిద్రపోతున్నావు. చుట్టూ గుత్తి వెలిగించి ఉన్నాయి. నీలాదేవి జడలో పూలు సువాసలు వెదజల్లుతున్నాయి. ఆమెతోనైనా మాట్లాడదామనుకుంటే ఆమె ఎదమీద ఎదనుంచి నీవు పడుకున్నావు. అమ్మా నీలాదేవి! నీవైనా స్వామిని నిద్రలేపవమ్మా! కొంచమైనా అతని ఎడబాటును సహించలేవా? అది నీ స్వరూపానికి, స్వభావానికి తగిన పని కాదమ్మా!"


నీలాదేవి, శ్రీకృష్ణుడు నిద్రపోయే మంచాన్ని పంచశయనం అంటారు. ఈ పంచశయానికి మెత్తగా , విశాలంగా, ఎత్తుగా, పరిమళభరితంగా ఉండాలి. అలాగే కాలానికి తగ్గట్టుగా వెచ్చగా, చల్లగా ఉండాలి. భగవంతుడే పాన్పు కాగా ఆ పాన్పు చుట్టూ గుత్తి దీపాలు వెలిగించి ఉన్నాయి. దీపము జ్ఞానానికి ప్రతీక. అది ఐదు దీపాలుగా వచ్చేట్టుగా పెట్టి ఉన్నాయి. అదే గుత్తు దీపం అంటారు. ఆ ఐదు విశేషాలు ఏంటంటే.. శ్రుతి, స్మృతి, ఇతిహాసము, పురాణము, ఆగమాలు. నీలాదేవి దంతపు కోళ్ల మంచం మీద పడుకుని ఉంది. శ్రీకృష్ణుడు కువలయాపీడనమనే ఏనుగును చంపి దాని దంతాలను మంచం కోళ్లుగా అమర్చాడు. ఆ ఏనుగే అహంకారము. నేను అనుభవించేవాడిని, చేసేవాడిని, తెలుసుకునేవాడిని, భగవంతుడికి దాసుడను అనే నాలుగు అహంకారాలను మంచం కోళ్లుగా చేసుకుని దానిపై స్వామి కూర్చున్నా, శయనించినా చాలు ఆ అహంకారం అణిగిపోతుంది.


నీలాదేవి జడలో సువాసనలతో కూడిన పూలను ధరించి ఉంది. ఆ పూలే జీవాత్మలు. జీవకోటిని పరమాత్మతో చేర్చడమే ఆమె ముఖ్యమైన ఆశయం. ఆమె కళ్ళకు పెట్టుకున్న భక్తి సిద్ధాంజనమనే కాటుక మనలో ఉండే పరమాత్మను దర్శించుకునేలా చేస్తుంది. జీవులు బాధలను అనుభవించునప్పుడు ముందుగా అమ్మా అనే అంటారు. అందుకే ఆ స్వామి కొరకు ముందుగా అమ్మను ప్రార్ధిస్తున్నారు గోపికలు.

పాశురము - 18వ రోజు

 తిరుప్పావై --- 18 పాశురం



ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్

నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్

ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి

ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్

పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ

శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప

వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం : తిలాంగ్


మత్తగజరాజముల నెదిరించెను - మంచి

భుజ బలము గల నందుని కోడలా!

నెత్తావి కురుల నెలతరో నప్పిన్న!

నీ స్వామి కీర్తింప గడె తీసి రావే! // మత్తగజ//


కోళ్లు కూయగ అంతటా, మాధవి పందిట

కోయిలల కుహుకుహూలు చెలరేగె

బంతి చేతను గల మేల్బంతి నీల!

కరకంకణములు గలు గల్లుమనగ

తలుపు తీయగరావే ముదమార ముదితరో!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..


నిన్న నందగోపభవనంలో నందుని , యశోదను మేల్కొల్పిన గోపికలు శ్రీకృష్ణుడు కానరాక నందుని అడగారు. అతను శ్రీకృష్ణుడు తన ప్రియసఖి నీలాదేవి భవనంలో ఉన్నాడని తెలియచేస్తాడు. అప్పుడు ఆ గోపికలంతా నీలాదేవి భవనానికి వచ్చి ఆమెను నిద్ర లేపుతున్నారు. నీలాదేవి శ్రీకృష్ణుని ప్రియ సఖి. అత్యంత సన్నిహితురాలు. ఏడు ఎద్దులను కలిపి కట్టి ఈమెను పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. ఈమె ద్రావిడబాషలో 'నప్పిన్న'గా, భాగవతంలో 'నాగ్నజిత్తి'గా కనిపిస్తుంది. ఆమె లేపితేనే కృష్ణుడు నిద్ర మేల్కొంటాడు. అందుకే గోపికలు నీలాదేవి భవనానికి వచ్చి ఆమెను మేల్కొల్పుతున్నారు.


"మదపుటేనుగు బలము కలవాడు, వెనుదీయని భుజబలము కలవాడు అయిన నందుని కోడలమ్మా! నప్పిన్నా! పరిమళము వెదజల్లే నల్లని కురులు కలిగిన నీలాదేవి! తలుపు తీయుము. బయట కోళ్లు మేల్కొని అరుస్తున్నాయి. మాధవీ పందిరిమీద కోయిలలు కూస్తున్నాయి. తెల్లవారిందని ఇంకా నీకు తెలియలేదా? చేతిలో బంతిని పట్టుకున్నదానా! నీ మేనబావను కీర్తించడానికి వచ్చాము. సంతోషంగా లేచి వచ్చి ఎర్రని తామరపువ్వులాంటి నీ చేతితో అందమైన నీ చేతిగాజులు గలగలాడగా వచ్చి తలుపు తెరువమ్మ..


నప్పిన్న! నందుని కోడలా! అనడంలో మామగారు నందుడు అందరికీ ఉదారంగా సాయం చేస్తారు అలాగే కోడలివైన నువ్వు మా కోరిక తీర్చాల్సిందే అన్న సూచన కనిపిస్తుంది. కృష్ణుడు పుష్పమైనప్పుడు ఆమె పరిమళమౌతుంది.. అందుకేనేమో ఆమె కేశాలు గుభాళిస్తున్నాయి. ఆ సుగంధం బయటకు కూడా ప్రసరిస్తుండడంతో స్వామి లోపల ఉన్నాడని అందరికీ తెలిసిపోతుంది. తెల్లవారుతుందనడానికి గుర్తుగా కోళ్ళు అంతటా అరుస్తున్నయంట. భగవంతుని భక్తులే ఈ కోళ్లు అనవచ్చు. కోళ్ళు తమకు ఆహారం ఐన ధాన్యపు గింజలను ఏరుకుంటూ ఎంతో విలువైన రత్నాలు దొరికినా వాటిని పక్కకు తోసేస్తాయి. అదే విధంగా భాగవతోత్తముడైనవాడు సంసారంలో ఉన్నా అనవసరమైనవి త్యజించి అవసరమైన భగవత్ తత్వాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. మాదవీలత అల్లుకున్న పందిరిపై కోయిలలు మధురంగా కూస్తున్నాయి. అలా కోకిలలా తమ మధురగానంతో లోకాన్ని ఆనందమయం చేస్తారు ఆళ్వారులు.


మాధవి అంటే లక్ష్మి ఆమె లతతో పోల్చబడింది. ఆ లత ఆశ్రయించిన పందిరి ఆ నారాయణుడు. మాధవి పందిరి అంటే ఆ శ్రీమన్నారాయణ తత్వం. అదే ఆధారంగా జీవించే పుణ్యాత్ములు ఆళ్వారులు. ఈ పాశురంలో మరో విశేషం ఉంది. నీలాదేవి తన చేతిలో బంతి పట్టుకొని ఉందంట. ఆమె శ్రీకృష్ణునితో రాత్రి బంతి ఆడి ఆడి అలసి నిద్రపోయింది. విభూతి (సర్వ ప్రపంచం) ఐన బంతి ఒక చేతిలో, విభూతిమంతుడైన పరమాత్మ మరో చేతిలో ఉన్నారు. ఈ రెండూ కలిసిందే నారాయణ తత్వం లేదా శ్రీ తత్వం. భగవంతుని పొందాలనుకునేటప్పుడు మనకు సాయపడేది ఈ 'శ్రీ' ... అతనే మనకు ఉపాయము, సర్వస్వమూ అని తెలియచేసి, ఆ భగవంతునితో మనలను జతచేర్చే దయామయి ఈ లక్ష్మీదేవి. ఈ పాశురం గానం చేసినంతనే మనకు అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది అని పెద్దల మాట..


పాశురము - 17వ రోజు

 తిరుప్పావై --- 17 పాశురం



అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం

ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్

కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే

ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్


అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద

ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!

ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: మలయ మారుతం


వస్త్రమే, ఉదకమే, అన్నమే ధర్మము చేయు

మా స్వామీ! ఓ నందా! ఇక మేలుకో!

ఇంతులలో మేల్బంతీ! ఓ మంగళ దీపమా!

మా స్వామినీ! యశోదా! మేలుకో // వస్త్రమే //


పెరిగి నభమున కరిగి లోకాలు కొలచిన

మా దొరా! నిద్దుర ముద్దు కాదురా!

స్వర్ణారుణ మంజీర శ్రీపాదా బలదేవా!

నీ అనుజుండు నీవు నిద్రమేల్కొనుడు!

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


గోదాదేవి , మరో పదిమంది గోపికలు కలిసి శ్రీకృష్ణుని పూజించడానికి నందగోపభవనానికి చేరుకున్నారు. అక్కడి భవన, ద్వారపాలకులను అర్ధించి తలుపులు తీయించి లోనకు ప్రవేశించారు. అక్కడ బలరాముడు, యశోధ, శ్రీకృష్ణుడు నిద్రపోతున్నారు. గోదా, గోపికలు వారిని మేల్కొల్పుతున్నారు. "వస్త్రములు, నీరు, అన్నము అవసరం ఐన వాళ్లకు ధర్మము చేయి స్వామి!.నందగోపాలా! మేలుకో..ప్రబ్బలి చెట్లవలె సుకుమారమైన శరీరముగల స్త్రీలలో చిగురువంటి దానివైన ఓ యశోదమ్మా. మా వంశానికే మంగళకరమైన దీపమువంటి దానా మేలుకో! ఆకాశంలోని మధ్యభాగాన్ని చీల్చుకుని పెరిగి లోకాలను కొలిచిన నిత్యసూరులకు నాయకుడా! త్రివిక్రమా! మేల్కొనవయ్యా! ఎర్రని బంగారు కడియాన్ని ధరించిన బలరామా! నీ తమ్ముడు, నువ్వు మేలుకోండి" అని ప్రార్ధించారు.


గోపికలు ముందుగా నందుని ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్థులందరికీ వస్త్రము, నీరు, అన్నము వారు తృప్తి చెందేవరకు ఇస్తాడు నందుడు. భగవంతుని చేరడానికి ముందుగా ఆచార్యుడైన నందుని ప్రార్ధిస్తున్నారు గోపికలు. శరీరానికి అన్నంలా ఆత్మకు పరిపూర్ణమైన బ్రహ్మానుభవాన్ని ఆహారంగా ఇచ్చేవాడు గురువు. సంసారబంధనాలతో అలసిన జీవునకు భగవంతుని నామస్మరణమనే జలాన్ని ఇచ్చి దప్పిక తీర్చేవాడు గురువు.. వారి మాటలకు మేల్కొన్న నందుడు చిరునవ్వుతో అనుమతినిచ్చాడు. కుమారునిపై వాత్సల్యము, భర్తమీద అనురాగము కలిగిన యశోద వారిరువురి మధ్య మంచంపై నిద్రపోయి ఉంది. నందగోపుడు గురువు కాగా యశోద మంత్రము. 'ఓమ్' అనే ప్రణవంలో అ+ఉ+మ్ అని మూడక్షరాలుంటాయి. అందులో అకారము పరమాత్మ , మకారము జీవుడు కాగా మధ్యలోఉ ఉన్న ఉకారము జీవునకు పరమాత్మకు గల విడదీయరాని అనుబంధము లేదా అమ్మను తెలుపుతుంది. గోపికలు ఆచార్యుని, మంత్రాన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మంత్రార్ధమైన శ్రీకృష్ణుని మేల్కొల్పుతున్నారు. ఇక్కడ బలదేవా అని పిలవడంలో శేషావతారం అని కూడా స్పురిస్తుంది. ఓ బలదేవా శేషసాయి ఐన నారాయణుడికి నీవు శయ్యవు కదా? శయ్యమీద పడుకున్నవారు నిద్రిస్తారు కాని శయ్యయే నిద్రించిన విడ్డూరం కాదా? అని గోపికలు చమత్కరిస్తున్నారు.

పాశురము - 16వ రోజు

 తిరుప్పావై --- 16 పాశురం

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ

కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ

వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్

ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై

మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్

తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా

నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్


రాగం: భాగ్యశ్రీ


నాయకుడైనట్టి నందగోపుల వారి

ప్రాసాద రక్షకా! ఓ ద్వారాపాలకా!

మణిమయ ద్వారమ్ము గడి తీయుమయ్యా!

చిన్ని గోపెమ్మలము శ్రీకృష్ణుని చేరెదము //నాయకు //


మాయావి కన్నయ్య మాకు పర ఇత్తునని

నిన్ననే మము కలిసి మాట ఇచ్చేను.

శుద్ధిగా చేరితిమి సుప్రభాతము పాడ

మునుముందుగ నీవు కాదనకు స్వామి!

పొందికగ ఉన్న ఆ తలుపులను తెరువుము

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..


తిరుప్పావై ఒక మణిహారం కాగా ఈ హారంలో పై పూస శ్రీకృష్ణుడైతే మధ్యలోని మణిపూస ఈ పాశురం అని చెప్పవచ్చు. శ్రీ వ్రతం చేసే అర్హత కలిగిన గోపికలను తోడ్కొని గోదాదేవి నందగోపభవనానికి చేరుకుంది. వారందరూ ఆ భవనం లోపలికి ప్రవేశించడానికి ఆ భవన పాలకుని, ద్వారపాలకుని అర్దిస్తున్నారు.


"మా నాయకుడైన నందగోపుని భవనాన్ని కాపాడే భవన పాలకా! మమ్మల్ని లోపలికి పోనిమ్ము. అందమైన పతాకంతో ప్రకాశిస్తున్న ద్వారాన్ని కాపాడే ద్వారపాలకా ఈ మణిమయభూషితమైన తలుపుల గడియ తీయుము. శ్రీకృష్ణుడి మాకు పరవాద్యాన్ని ఇస్తా అని నిన్ననే మాట ఇచ్చాడు. అందుకే మేము ఆ కృష్ణుడికి సుప్రభాతం పాడడానికి పరిశుద్ధులమై వచ్చాము. ఓ ద్వారపాలకా! మూసి ఉన్న తలుపులను తెరిచి మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వు" అని అర్ధించారు.


మనం ఎప్పుడుగాని గురువులను ఆశ్రయించకుండా భగవంతుని చేరరాదు. ఆచార్యులను కలిసేటప్పుడు వారి అంతరంగ శిష్యులను ముందు ఆశ్రయించాలి. దానికి అహంకారము లేకుండా వినయంగా ఉండాలి. అందుకే గోదాదేవి పదిమంది మహాత్ములను ఆశ్రయించి వారిని తీసుకుని అహంకార రహితులై నందగోపుని ఆశ్రయించడానికి ముందుగా అక్కడి భవన, ద్వారపాలకులను అర్ధించారు. భగవంతుని చేరడానికి ముందుగా పది మంది గోపికలను వశపరుచుకోవడంలో ఇంద్రియ నిగ్రహం, భవన పాలకుని అర్ధించడంలో ప్రాణసంయమనం, ద్వారపాలకుని అర్ధించడంలో మనోజయం సూచింపబడింది. ఇక్కడ మరో విశేషం గురించి చెప్పుకోవచ్చు. నందగోపభవనం ముందు పూలతోటలు, కొలనులు, ద్వార వైభవాన్ని చూసి ఆకర్షించబడి లోపలికి వెళ్లడానికి సందేహిస్తారు. కాని ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్లాక ఆ పరమాత్మ సౌందర్యాన్ని చూసి అక్కడే ఉండిపోవాలనుకుంటారు కాని బయటకు రావాలని కోరుకోరు. గోపభవనానికి మూసి ఉన్న తలుపులే మనలో ఉండే అహంకార మమకారాలు. వాటిని బయటకు కాకుండా లోపలకు నెట్టాల్సిన తలుపులు. అందుకే వాటిని తెరవమని ద్వారపాలకుని ప్రార్ధించారు గోపికలు. మన అహంకార మమకారాలను మనమే తొలగించుకునే శక్తి ఉండదు. అది గొప్ప యోగులకే సాధ్యం. అందుకే నీవే వాటిని వెనక్కు త్రోసి మమ్మల్ని ఆ భగవంతుని వద్దకు వెళ్లనిమ్ము అని ద్వారపాలకుడిని అర్ధించారు.

Thursday, December 17, 2020

పాశురము - 15వ రోజు

 తిరుప్పావై --- 15 పాశురం



ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో

శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్

వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్

వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ

ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై

ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్

వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క

వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్


రాగం : భైరవి

ఏమే చిన్నారి చిలుకా! ఎన్నాళ్ళె నీ నిదుర?

జిల్లుమని పిలువకుడె ఓ తల్లులార! ఇదె వచ్చేను.

నీ నోటివాటము, నీ మాట పాటవము

తెలిసికొన్నాములే తెమలవే కలికి! //చిన్నారి //

మాటకారులు మీరే - పోనీ నేనవుతాను

ఏమిటే నీ గొప్ప ఒప్పులకుప్ప?

వచ్చిరా అందరు? ఆఁ! - లెక్కించుకో

మత్తగజముల, శాత్రవుల మదమునణచిన

మాయావి కృష్ణుని మనము కీర్తింపగ

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము



ఈరోజు గోపిక అహంకారము తొలగి పరిపూర్ణ స్థితిలో ఉంది. ఆమె అప్పటికే నిద్రలేచి నిన్నటి పాశురం మధురంగా పాడుకుంటుంది. ఆమెను మేల్కొల్పడానికి వచ్చిన గోపికల బృందం అది విని ఇలా సంభాషించారు.

ఓ లేతచిలుకా! ఇంకా నిద్రలోనే ఉన్నావా?

అలా జిల్లుమని పిలవకండే.. ఇదిగో వస్తున్నానుగా..

అమ్మో నీవు మంచి నేర్పరివి, మాటకారివే. నీ నోటివాటం మాకు తెలీదా?

మీరే మాటకారులు! పోనీ నేనే అవుతాను

ఏమిటే నీ గొప్ప? తొందరగా తెములు.

అందరూ వచ్చారా?

ఆ! వచ్చారే! కావాలంటే నీవే లెక్కించు

సరే! నేను వచ్చి ఏం చేయాలి? చెప్పండి

మదించిన ఏనుగును మట్టుపెట్టినవాడు, శత్రువుల గర్వాన్ని అణచినవాడు, మాయావి ఐన ఆ శ్రీకృష్ణుడిని కీర్తిద్దాం రావమ్మా!

ఈ రోజు జరిగిన గోపికా సంవాదంలో మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్ధమవుతాయి. తాను అందరిలా నిద్రపోక , వేకువఝామునే మేలుకున్నా కూడా తోటివారు ఇంకా నిద్రపోతున్నావా? అని నిష్టూరమాడేసరికి భరించలేకపోయింది.తన మంచితనాన్ని నిరూపించుకోవడానికి వారి పరుష ప్రవర్తనను బయట పెట్టింది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇటువంటి ప్రవర్తన మంచిది కాదు. ఒకరితో ఒకరు వాదిస్తే హృదయంలోని భగవదనుభవం తరిగిపోతుంది. అందుకే లోపలున్న గోపికకు జ్ఞానోదయమై నేనే కఠినురాలిని అని ఒప్పుకుంది. మన తప్పు ఉన్నా లేకున్నా పెద్దలు ఉన్నది అంటే మనసులో కూడా బాధపడక సంతోషంతో స్వీకరించడమే క్షమాగుణంలోని పరాకాష్ట. మనలోని దోషాలను ఎత్తి చూపినవారిని శత్రువులుగా ద్వేషించక, శ్రేయోభిలాషులుగా భావించి నిందాస్తుతులను సమానంగా స్వీకరించాలి. స్తుతిని నిందగానూ, నిందను స్తుతిగానూ భావించి తనను తాను సరిదిద్దుకునేవాడే భాగవతోత్తముడు. అంతే కాదు ఒకరికంటే ఒకరు తక్కువ వారము అనుకోవడం ఉత్తమ శ్రీవైష్ణవ లక్షణం. అందుకే లోపలున్న గోపిక ముందు నిష్టూరాలాడినా తర్వాత నింద తనమీదే వేసుకుంది.

భగవంతుని దర్శనానికి వెళ్లేటపుడు పదిమంది భాగవతోత్తములైన ఆళ్వారులను సేవించి తోడ్కొని పోయినట్టు గోదాదేవి పదిమంది ఉత్తములైన గోపికలను మేల్కొలిపి శ్రీకృష్ణుడుండే భవనానికి చేరుకుంది... దీనితో శ్రీవ్రతం అనబడే తిరుప్పావై వ్రతం పూర్వభాగం పూర్తైంది. భగవంతుని భక్తులను మేల్కొల్పడం పూర్వభాగం. భగవానుని మేల్కొల్పడం ఉత్తరభాగం.

పాశురము - 14వ రోజు

 తిరుప్పావై --- 14 పాశురం



ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్

శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్

శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్

తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్

ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్

నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్

శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం

పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్


రాగం: దేశి


నీ పెరటి తోటలో, ఆ నడిమి బావిలో

కమలాలు పూసినవి - కలువలు కనుమూసినవి

కాషాయములు దాల్చి కదలిరదె జీయరులు

కుంచకోలల కోవెలలు తెరువంగ //నీ పెరటి//

మునుముందు మమ్ముల మేలుకొలిపెదనంచు, పూర్ణా!

బీరములు ఆడి నీవు మాట మరచితివే - లజ్జావిహీనా!

శంఖచక్రధరుని పంకజనేత్రుని

విశాల బాహుని నామము పాడగరావే! మధురభాషిణి!

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


అందరికంటే ముందు లేచి అందరినీ మేల్కొలుపుతాను అని మాట ఇచ్చి మరచిపోయి ఇంకా నిద్రపోతున్న గోపికను ఈరోజు మేల్కొల్పుతున్నారు. ఈ గోపిక ఉన్నది ఒక విశాలభవనం. దాని వెనకాల తోటలో అందమైన కొలను. అందులో కలువలు తామరలు కదలాడుతూ అందంగా ఉన్నాయి. "అమ్మా! చూశావా? కలువపూలు ముడుచుకుంటున్నాయి. తామరపూవులు వికసిస్తున్నాయి. తెల్లవారిందమ్మా లే! ఎర్రని కాషాయవస్త్రాలు ధరించి, తెల్లని పలువరుస కలిగిన సన్యాసులు దేవాలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు. అందరికంటే ముందుగా లేచి మమ్మల్నందరినీ లేపుతానని మాట ఇచ్చి తప్పావు. సిగ్గులేనిదానా! మంచి మాటకారివే! పరిపూర్ణురాలా! ఆజానుబాహువు, పుండరీకాక్షుడు, శంఖచక్రాలను ధరించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తిద్దాం . రా తొందరగా!


మన శరీరమనే భవనంలో వెనుక ఒక తోట ఉంది. అది భగవంతునితో కలిసి విహరించే స్థలం. అదే మన వెన్నుపూసలో ఉండే నాడీమండలం. మన నాభినుండి శిరఃస్థానం వరకు ఉన్న నాడీమండలంలో ప్రయాణం చేసి భగవంత్ తత్వాన్ని దర్శించాలి. ఆ తోటమధ్యలో కొలను అందులొ వికసించిన పద్మాలు. నాడీమండలంలో ఉండే చక్రాలనే పద్మములని అంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అనే ఏడు పద్మాలు వికసించాయి. దానికర్ధం జ్ఞానేంద్రియాలు వికసించాయన్నమాట. ఇక కలువలు ఇంద్రియాలు. నిద్రిస్తున్న గోపికను పరిపూర్ణులారా అన్నారు. ఆమె కృష్ణప్రేమలో పూర్తిగా మునిగిపోయి ఉన్నది.. కాషాయములు ధరించిన సన్యాసులు కుంచెకోలలను చేతబట్టుకుని ఆలయాలు తెరిచి ఆరాధన చేయడానికి వెళ్తున్నారట. కాషాయం వైరాగ్యానికి చిహ్నం..గురువుల ఉపదేశమే హృదయమనే ఆలయపు తలుపును తెరిచే కుంచెకోల.

పాశురము - 13వ రోజు

 తిరుప్పావై --- 13 పాశురం



పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై

కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్

పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్

వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు

పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్

కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే

పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్

కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: వలజి


బకాసురుని డంబమడచిన దామోదరుని

దుష్తరావణుద్రుంచిన శ్రీరాముని

నామము పాడగ కన్నెపడుచులు

నోము సీమను చేరి వేచి యున్నారు //బకాసురుని//

శుక్రుడుదయించెను - గురుడస్తమించెను

పక్షులదెకూసెనే - పడతిమేల్కాంచవె -

చల్లని నెట జలకాలు ఆడవే - కపటము వీడవే

మంచమ్ము విడిరావె - మాతోడ కలియవే!

జగతికే మంగలము కూర్చుమన శ్రీవ్రతము


రోజు ఒక గోపికను నిద్రలేపడమేంటి అనిపించవచ్చు కాని గోపికలనే ఆళ్వారులను కీర్తిస్తూ నిద్ర మేల్కొలిపి వారిని తోడ్కొని ఆ పరమాత్మ సన్నిధికి చేరాలి అనే అద్భుతమైన భావం ఈ పాశురాలలో ఉంది. ఈనాడు మేల్కొలిపే గోఫిక నేత్రాలు చాలా అందమైనవి. అందరినీ ఆకర్షించే తుమ్మెదతో కూడిన తామరపూవులాంటి కళ్లు, లేడి చూపులు కలిగి ఉన్నది. ఈ నేత్ర సౌందర్యమే ఆ శ్రీకృష్ణుని తన వద్దకు తీసుకొస్తుందనే నమ్మకం కలిగి ఉన్నది. ఇక్కడ నేత్రమంటే జ్ఞానం. జీవుడు పరమాత్మకే చెందినవాడు రక్షింపబడేవాడు, దాసుడు అని తెలుసుకున్నవారు ఆ పరమాత్మను పొండడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు. ఈ స్థితిలో ఉన్న గోపికను గోదాదేవి మేల్కొలుపుతుంది.


బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టుడైన రావణాసురుని చంపిన శ్రీరాముని కీర్తిని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ అప్పుడే వ్రతక్షేత్రానికి చేరారు. తుమ్మెద కలిగిన తామరపూవులలాంటి కళ్లు ఉన్న చినదానా! శుక్రుడు ఉదయిస్తున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు. లేడి చూపులు కలిగినదానా! పక్షులు కూయుచున్నవి. ఈ శుభదినాన శ్రీకృష్ణవిరహం తీరి చల్లబడేట్టుగా నీటమునిగి స్నానం చేయకుండా ఇంకా శయ్యపై పడుకుని ఉన్నావా? ఓ సుకుమరి తొందరగా వచ్చి మాతో కలువుము...


భగవంతుని తత్వాన్ని మన నుండి దూరం చేయడానికి వచ్చే శత్రువులే ఈ బకాసురుడిలాంటి రాక్షసులు. అమాయకంగా ఏమీ తెలియనట్టు బయటకు కనిపిస్తూ మనసులో మాత్రం కృష్ణుని చంపి తినవలెనని ఆలోచన కలిగి కొంగ రూపంలో నిలిచాడు బకాసురుడు. తనను అంతమొందించడానికి వచ్చినదని గ్రహించిన శ్రీకృష్ణుడు దాని నోటిని చీల్చి అంతమొందించాడు. ఒక విధంగా ఉన్నవారు వేరొక విధంగా కనపడాలని చేసే ప్రయత్నమే దంబము. దంబము కంటే ప్రమాదకరమైంది అహంకారము. ఇక్కడ ప్రస్తావించిన రావణాసురుడు అహంకారము. నేను కాని దానిని నేను అనేవిధంగా చెసేదే అహంకారం. అశాశ్వతమైన శరీరమే ఆత్మ అని ఆలోచన ఈ అహంకారం వల్లనే కలుగుతుంది. అది కలిగిన వెంటనే ఆత్మకు, పరమాత్మకు గల సంబంధం తెగిపోతుంది. బకాసురుని కృష్ణుడు, రావణాసురుని రాముడు సంహరించడం తమకోసమే అని గోపికలు ఆనందంతో కీర్తిస్తూ ఆనందిస్తున్నారు.


శుక్రుడు ఉదయించడం, గురుడు అస్తమించడం ప్రాతఃకాలానికి ముందు వచ్చే గుర్తు. మనలో సాత్వికమైన భావం కలిగి, భగవంతుని వైపు మన బుద్ధి నిలవడానికి ముందుగా శుక్రుడనే జ్ఞానం ఆవిర్భవించి, అజ్ఞానమనే గురుడు అంతరించాలి. శుక్రుడు మృతసంజీవని విద్యకలిగినవాడు. శుక్రుని పూజించి మనము అమృతత్వం సాధించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు ఆ భగవంతునికి దూరం కాకుండా ఉండడం. అసురులను ఆకర్షించడానికి నాస్తిక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు. అతను అస్తమిస్తున్నాడంటే మనలోని నాస్తిక భావాలు నశించి భగవంతునియందు నమ్మకం మొదలైనదన్నమాట. అందుకే ఇది చాలా మంచి సమయం నిద్ర లెమ్మని అంటున్నారు.

పాశురము - 12వ రోజు

 తిరుప్పావై --- 12 పాశురం



కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి

నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర

ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్

పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి

శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త

మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్

ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్

అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం : రేవతి


లేగలను తలచి జాలిగొని అరచి

ఎనుములు సిరములు పాలుధారగ కురియ

వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ!

మేటి సంపదలున్న మొనగాడి చెల్లెలా!

మంచు మాతలలపై పడగ నీ వాకిలి పట్టి

కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని

కీర్తింపగ, పెదవి కదపవేమె కలికి!!

మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ!

నీ సంగతులు తెలిసె లే! బంగారు బొమ్మ

జగతికే మంగళం కూర్చు మన శ్రీ వ్రతము


నిన్నటి పాశురంలో గోపాలురు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని ఆచరించేవారని చదువుకున్నాం కదా. ఈరోజు ఆ స్వధర్మం కూడా అవలంభించని ఓ గోపిక గురించి తెలుసుకుందాం. ఈ గోపికనే గోదాదేవి, ఇతర గోపకాంతలు మేల్కొల్పుతున్నారు. ఈమె స్ధితప్రజ్ఞత అవస్ధలలోని తొలిదశ యతమానావస్ధలో ఉంది. తాబేలు తన అవయవములను మొత్తం లోపలికి లాక్కుని ఉంటుంది అదేవిధంగా ఈ గోపిక వలెనే ఇంద్రియములను ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించినవాడే స్ధితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గోపిక శ్రీకృష్ణుడి ఆప్తమిత్రుడు శ్రీదాముని సోదరి. అతను కృష్ణు డి సేవలో పూర్తిగా మునిగిపోయి తన ఇంటిలోని గేదెల పాలు కూడా పిండడం లేదు. ఆ గేదెలు తమ పాలు పిండేవారు లేక తమ లేగదూడలు కూడా పాలు త్రాగకపోవడంతో పొదుగుల బాధతో అరుస్తూ వాటిని తలుచుకుంటూ పాలను నేలపై స్రవించాయి. ఆ పాలతో ఇల్లంతా చిత్తడిగా మారింది. ఈ వేకువజామున మంచు మా తలలపై కురుస్తున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటివాకిట నిలబడ్డాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిటి పై దండెను పట్టుకొని నిలబడ్డి తన భార్యను అపహరించిన ఆ లంకాధీశుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము. అది విని కూడా నీవు పెదవి విప్పడంలేదు. ఇదేమి గాఢనిద్ర?. లేచి రావమ్మా ఇప్పటికే ఇరుగుపొరుగు వాళ్లు కూడా వచ్చి నీ నిద్రను చూస్తున్నారు.


గేదెలు దూడలకై చేపు వచ్చి అరుస్తున్నాయి. తమను తాము పోషించుకోని వారు లేగదూడలవంటివారు. ఆవులు, గేదెలు ఉదారులైన గురువులు. ఈ గేదెలకు సమృద్ధిగా పాలు ఉండడమంటే వారికి భగవదనుగ్రహం సంపూర్ణంగా ఉండడం. కట్టి ఉంచిన దూడలు తమ తల్లి వద్దకు చేరుకోలేనట్టే జీవుడు తన కర్మపాశంతో, అవిద్యతో ఈ శరీరమనే దుంగకు కట్టబడ్డాడు. దానిని వదిలించుకుంటే గాని భగవంతుని చేరలేడు. అతనిని ఆ పరమాత్మ వద్దకు చేర్చేవాడే గురువు. క్రింద నేలంతా బురదగా మారి పైన మంచు కురుస్తుంది. భగవంతుని అనుభవప్రవహమే ఈ నేలపై ఉన్న తడి, మంచు ఆళ్వారుల దివ్య సూక్తులు. భగవంతుని అనుభవంలో చేరడానికి సాయం చేసే దివ్యమంత్రమే అష్టాక్షరి. ద్వారం మీద ఉన్న దండెను పట్టుకుని ఈ గోపికలు రావణాసురుని చంపిన రాముడి గుణగానం చేస్తున్నారు. రావణుడు పాలించిన లంకయే మన శరీరము కాగా ఆ రావణుడే మన మనస్సు. దశేంద్రియాలే ఆతని పది తలలు. మనస్సును నిగ్రహించుకుని సీత(ఆత్మ) ను తనలో చేర్చుకున్నాడు శ్రీరాముడు. అందుకే ఆతని కీర్తిస్తున్నారు.

పాశురము - 11వ రోజు

 తిరుప్పావై --- 11 పాశురం



కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు

శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం

కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే

పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్

శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-

ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ

శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-

ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ


వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు

అరుల బలము అణగ పోరు సైపెడువారు

దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!

పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!

రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//

చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ

నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప

ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!

చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..



ఈరోజు నిద్ర మేల్కొల్పే గోపిక కులంలో, గుణంలో, అందంలో మిన్నయైనదై కృష్ణుడివలెనే వ్రెపల్లెలో అందరి మన్ననలను పొందింది. భగవంతుని కైంకర్యమే ఐశ్వర్యంగా భావిస్తుంది ఈ గోపిక. వివిధములైన ధర్మములను ఆచరిస్తూ వాటి ఫలితములకోసం ఎదురుచూడక అవి భగవదారాధనా రూపాలని భావిస్తుంది.



ఈ గోపికను గోదాదేవి ఇలా మేల్కొపుతుంది. "లేగదూడలు కల ఆవులైనా దూడలవలె ఉన్న పలు ఆవుల మందల పాలు పితికేవారు, శత్రువులను బలాన్ని నశింప చేయడానికి యుద్ధం చేసేవారు, ఎట్టి దోషము లేనివారైన గోపాలవంశాన జన్మించిన ఓ స్వర్ణలత! పుట్టలోని పామువలె నున్న నడుము గలదానా! వనమయూరీ! సంపన్నురాలా! రమ్ము. చుట్టాలు, చెలికత్తెలు అందరూ వచ్చారు.. నీలమేఘశ్యాముడైన ఆ శ్రీకృష్ణుని నామాలను గానం చేస్తున్నారు. అయి నా నీవు ఉలకవు. పలకవు. దేనికోసం ఇంతగా నిద్రిస్తున్నావో చెప్పమ్మా!"



వ్రేపల్లెలోని ఆవులు దూడలు కలిగి ఉన్నా కూడా శ్రీకృష్ణుని వేణుగానము, స్పర్శచే సమృద్ధిగా పాలు ఇస్తున్నాయట. ఆ గోవులే సంసారబంధం వదిలిపెట్టిన ముక్తపురుషులు. వారి వయస్సు ఎప్పటికీ 25 ఏళ్లే.. ప్రకృతితత్వాలు 24 కాగా ఇరవై ఐదవది జీవతత్వము. ప్రకృతితత్వాలను దాటుకుని స్వస్వరూపంలో ఆవిర్భవించినవాడు ముక్తపురుషుడు. అలాగే భగవంతుడే కాక భాగవత్ శేషత్వాన్ని కలిగి ఉండడవల్ల ఈ గోపిక ధృఢమైన బంగారు తీగవలె కనిపిస్తున్నదట. ఆ గోపిక పడుకున్న తీరు ఎలా ఉందంటే పుట్టలోని పాములాంటి నడుము కలిగి ఉన్నది. మన శరీరంలోని మూలాధారంలో కుండలినీ శక్తి పుడుతుంది. ఈ కుండలినీ సర్పం ఆకారంలో 3 1/2 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. దీనిని మూలాధారం నుండి కదిలించి పైన శిరస్సులో ఉన్న సహస్రార చక్రంలో ప్రకాశింపచేయాలి. ఆమె కేశాలు నెమలి పురివిప్పినట్టుగా ఉన్నాయి . శ్రీవిద్యా సంప్రదాయం తెలిసి, హఠయోగంలో ప్రాణాయమం చేసే యోగులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ పాశురంలో చెప్పబడిన గోపాలవంశంవారు తమ సంపదనంతా భగవంతుడు, భాగవత్ కైంకర్యానికే వినియోగించేవారు. అట్టి వంశానికి చెందిన గోపికను ఈ రోజు మేల్కొలిపి తమతో పాటు శ్రీవ్రతాన్ని ఆచరించడానికి తీసికెళ్లారు.

పాశురము - 10వ రోజు

 తిరుప్పావై --- 10 పాశురం



నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం

తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో

ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే

తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్


రాగం: పూరీ కళ్యాణీ


నోచి స్వర్గభోగముల తేలేటి ఓ తల్లి!

తలుపు తీయకున్నావు! మాటయిన అనరాదా

తులసి కిరీటధారి నారాయణుని మనము

సేవించితే చాలు - పరనొసగు పుణ్యమూర్తి

ఆనాడు శ్రీరామునిచే మృత్యువు వాతబడిన

కుంభకర్ణుడు ఓట్ అతని గాఢ నిద్ర నీకొసగెనా?

నిద్రమత్తుని వీడి ఓ నీలవేణి!

తెప్పరిల్లుచు వచ్చి తలుపు తీయగరావె!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.



ఈరోజు నిద్ర మేల్కొలిపే గోపిక శ్రీకృష్ణుని పొరుగింటి పిల్ల. ఈమె తనకు తానుగా కృష్ణుడికోసం ఎదురు చూసేది కాదు. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడనే నమ్మకం కల చిన్నది. ఈ గోపిక ఫలితం వచ్చినా రాకున్నా దాని వల్ల వచ్చే లాభనష్టాలన్నీ భగవంతుడివే కాని తనవి కావనే నిశ్చింతతో నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మనసు తప్ప ఇంద్రియాలన్నీ పని మానేస్తాయి. కాని ఆ మనసు మాత్రం పరమాత్మనే తలుచుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోతున్న గోపికను గోదా, మిగిలిన గోపికలు కాస్త వ్యంగ్యంగా మేల్కొల్పుతున్నారు.


"ఏమమ్మా! మాకంటే ముందే నోము నోచుకుని స్వర్గంలోకి ప్రవేశించావా? పోనీ వాకిలి తెరవకున్నా పర్లేదు. ఈ ఒక్క మాటైనా చెప్పు. పరిమళించే పవిత్రమైన తులసీదళాలు ధరించిన నారాయణుడు మాచే వేనోళ్ల కొనియాడబడి మాకు పురుషార్ధాన్ని ఇస్తున్నాడు కదా. ఆ రామచంద్రుని మూలంగా మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు నీతో అతని గాఢనిద్రను పణంగా పందెం కాచి ఓడిపోయి నీకు ఇచ్చి వెళ్ళాడా? చెప్పమ్మా! మరీ ఇంత మొద్దు నిద్దరైతే ఎలాగమ్మా? మాకందరికి అరుదైన శిరోభూషణమైనదానివి నీవే కదా తల్లీ. ఇకనైనా నిద్ర లేచి వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు....

ఇక్కడ స్వర్గమనగా భగవదనుగ్రహం. ఆనందము. భగవంతునితో కలిసి ఉండడమే స్వర్గంతో సమానం. అంతేకాక ఈ పొరుగింటి గోపిక కోసం ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట.. ఒకరిని పొండడానికి ఒకరు వ్రతం చేస్తున్నారు. అందుకే ఆ దేవదేవుడు ధరించే తులసీమాలల సౌరభాలు బయటకు కూడా వస్తున్నాయి. ఆ పరమాత్మ వద్దకు వెళ్లి మనమేమీ అడిగే పని లేదు. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. మనకు కావలసిన వన్నీ తానే తెలుసుకుని ఇస్తాడు.

పాశురము - 9వ రోజు

 తిరుప్పావై --- 9 పాశురం



తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్

దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం

మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్

మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్

ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో

ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో

మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు

నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్


రాగం : అమీర్ కళ్యాణి


మేలి రతనాల మేడలో చుట్టూ దీపాలు వెలుగ

ధూపాలు వీవ, మేలితల్పాన నిదురించు

మా మామ కూతురా! మణితలుపు గడి తెరువు // మేలి రతనాలు //


అత్తా! ఆమెను లేపవమ్మా! నీ తనయ

మూగదా లేక చెవిటిదా? అలసినదా?

కావలి ఉంచిరా! మంత్రము వేసిరా!

మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని

పలు తిరునామములు అనుసంధించుము - ఆమె మేల్కొనగ

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..


ఇంతకుముందు రెండు పాశురాలలో శ్రవణం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. 8 - 12 పాశురాలలో మననం, ధ్యాన ప్రాముఖ్యం గురించి నిరూపించబడింది. అట్టి ధ్యానంలో పరాకాష్ట చెందిన గోపికను ఈనాడు మేల్కొపుతున్నారు..


నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు. ఆమె లేచి మాతో వచ్చి చేరుతుంది. అని గోదాదేవి గానం చేసింది.


ఈనాటి గోపిక స్థితి వశీకావస్థలో ఉంది. భగవంతుదే సర్వస్వం అని తెలుసుకున్నదై ఆతని చేరడానికి ఆరాటపడక స్వప్రయత్నం పూర్తిగా వదిలిపెట్టి ఏ పనీ చేయక మూగ, చెవుడు కమ్మినట్టుగా గాఢనిద్రలో ఉంది. ఆ మేడ పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. భగవంతునితో జీవునికి గల సంబంధాలు కూడా తొమ్మిది విధాలు. 1.తండ్రి. 2. రక్షకుడు 3. శేషి. 4. భర్త. 5. జ్ఞేయుడు 6. స్వామి 7. ఆధారము 8. ఆత్మ 9.భోక్త.. ఈ నవవిధాలతో పరమాత్మను కూడి ఉండడమే ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞలో స్థిరంగా ఉండడమే స్తితప్రజ్ఞత. ఆ మేడలో దీపాల వెలుగుతో పాటు అగరు ధూపం పరిమళిస్తుంది. జ్ఞానం దీపంవంటిది కాగా ఆచరణ సుగంధం వంటిది. ఈ రెండు కలిగినవారికి ఆ భగవదనుగ్రహం సులువుగా లభిస్తుంది. ఈనాటి గోపిక సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని కూడా వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవంతుని నిలుపుకుని వశీకావస్థలో ఉంది. గోదాదేవి ఇతర గోపికల భగవన్నామస్మరణలు విని లేచి బయటకు వచ్చి వాళ్లతో కలిసింది.

పాశురము - 8వ రోజు

 తిరుప్పావై --- 8 పాశురం



కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: చక్రవాకం


తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.


తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.


సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.

Tuesday, December 15, 2020

పాశురము - 7వ రోజు

 తిరుప్పావై --- 7 పాశురం



కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు

పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే

కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు

వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్

ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో

నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి

కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో

తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.



కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి

ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!

కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు

కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//

గోపికా నాయకీ! నారాయణుని మూర్తి

కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?

తేజోవతీ లేచి తెరువవే తలుపు

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.


నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు..


పాశురము - 6వ రోజు

 తిరుప్పావై --- 6 పాశురం



పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్

వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో

పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు

కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి

వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం

మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం

ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


రాగం: భూపాల


పక్షులు కూసెనులే! పక్షివాహను గుడిని

తెలి సంకు పొలికేక వినలేదటే!

బాల మేలుకొనవే.. // పక్షులు //

పూతన స్తనముల విషమును పీల్చి

కపట శకటమును కాల్చాచి కూల్చి

పాల్కడలిలో యోగ నిద్రలో నున్న విష్ణుని

ఉల్లమున నిలిపి మునులు యోగులు

మెల్లగా లేచి "హరిహరీ" అని పాడ

హృదయములు కదలాడి ఆహ్లాదమును తేల

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


గోదాదేవి వ్రతారంభం చేద్దామని గోపికలతో చెప్పగానే ఉదయాన్నే నిద్ర లేచారందరూ.. కాని ఇంకా పది మంది గోపికలు మేల్కొనలేదని తెలుసుకుని మరికొందరు గోపికలను తోడ్కొని వెళ్లింది. భగవంతుని ఆశ్రయించినప్పుడు మన ఒక్కరి సంకల్పము, ప్రయత్నముతోనే అది సాధ్యం కాదు. ఆ భగవంతుని సేవించే నిష్ణాతులైన వారి సహకారం తీసుకోవాలి. . మనకు సర్వాన్ని ఇచ్చే పరమాత్మను చేరడానికి యోగ్యులుగా చేసేవాడు గురువు. అతని ద్వారా ఆ స్వామిని చేరగలుగుతున్నాము. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆండాల్ తల్లి భగవదనుభవ నిష్టలైన పదిమంది గోపికలను మేల్కొలిపి, వారిని తోడ్కొని కృష్ణుని సన్నిధికి వెళ్తుంది.


ఇక్కడ మరో విషయం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ కృష్ణుని చేరుకుందామా అని ఆత్రుతతో నిద్ర రాక ఉండవలసిన వాళ్లు అలా నిద్రపోవటమేంటి? నిద్ర అనగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు మాని మనసు విశ్రాంతి తీసుకోగా ఆత్మ, పరమాత్మతో చేరి ఉంటుంది. ప్రతీ నిత్యం ప్రతీ జీవునికి సుషుప్తిలో జరిగేది ఇదే... కాని మన సుషుప్తిలో అజ్ఞానం మనను కప్పివేయడం వల్ల ఆ దివ్యానుభూతిని పొందలేకున్నాము. యోగులవలె ఆ పదిమంది గోపికలు సాత్వికమైన సుషుప్తిలో ఉన్నారు. అందరిలోకి చిన్నదైన ఉత్తిష్టను ఇలా మేల్కొలుపుతుంది గోదాదేవి. " ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు అప్పుడే లేచి కలకలలాడుతూ వెళ్తున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీమహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము స్వామి సేవకు వేళయింది రమ్మని పిలుస్తుంది. ఆ శబ్దం వినపడలేదా పిల్లా! లే ఇంకా పడుకున్నావ్.. మేము ఎవరూ లేపకుండానే లేచామనుకుంటున్నావా? పూతన స్తన్యమున విషాన్ని తాగినవాడు, శకటాసురుని కాలితో తన్ని కూల్చినవాడు, పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో నున్న మహావిష్ణువును తమ మనసులో పదిల పరుచుకుని మునులు, యోగులు చేస్తున్న హరీ హరీ అనే సంకీర్తనాలు మా మనసులోకి చేరి మమ్మల్ని గాఢనిద్రనుండి మేల్కొలిపాయి. ఓ పిల్లా! లే! నీవు కూడా లేచి రా" అని ఆ ముగ్ధను మేల్కొలిపారు. ఆమె లేచి వారితో కలిసింది.


ఈ పాశురంలో పది మంది గోపికలు, పూతన, శకటాసురుల ప్రస్తావన వెనకల పరమార్ధం ఉంది . ఈ పాశురంలో పదిమందిని మాత్రమే మేల్కొల్పడం గల విశేషం ఏమిటంటే... విష్ణు ఆలయాలలో మూల విగ్రహంతోపాటుగా పదిమంది ఆళ్వారులను కూడా ప్రతిష్టిస్తారు. ఆలయానికి వెళ్లినప్పుడు ముందు ప్రదక్షిణం చెసి ఆల్వారులను సేవించి , ద్వజస్తంభమునకు నమస్కరించి , అమ్మవారిని సేవించిన తర్వాతే మూలవిరాట్టును సేవించడం ఆచారంగా వస్తుంది. ఆ పదుగురిని సేవించి వారి కటాక్షము మనపై పడునట్లు చేసుకోవడమే ఆ పదిమంది గోపికలను మేల్కొలపడం. పూతన వృత్తాంతము కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంది. ఈ ప్రకృతి అనే పూతన అహంకార, మమకారాలు అనే స్తనముల ద్వారా విషయ భోగాలు అనే విషాన్ని ఇచ్చి మనను చంపుతుంది కాని పోషింపదు. అందుకే అది పూత న.. పవిత్రము గానిది అని అర్ధమవుతుంది. శకటాసురుని వృత్తాంతంలో ఆ బండి మన దేహము, దాని చక్రాలు పాపపుణ్య కర్మలు, అహంకార, ఆవేశాలతో ప్రవర్తించినపుడు ఆ భగవంతుడి పాదాలు తాకినంతనే ఆ చక్రాలు విరిగిపోయి మనకు మోక్షము లభిస్తుంది.

పాశురము - 5వ రోజు

 తిరుప్పావై --- 5 పాశురం



మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్


రాగం: కమాస్


మాయావి మన మధుర అధినాధుడు హరీ!

కూలంకష స్వచ్చ యమునా తీర విహారీ!

గోపాల వంశమున భాసించు మణిదీపము

తల్లి కడుపునకు చల్లని వెలుగు దామోదరు దరికి

పరిశుద్ధిగానేగి సుమముల రువ్వి, సేవించి

నోరార కీర్తించి - మనసారా ధ్యానింప

ఆగామి సంచిత పాపమ్ములన్నియు

నిప్పులో తూలికలగును నామమనుసంధింప

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము+++++++++++++++++


గోదాదేవి పిలుపును అందుకున్న గోపికలందరూ వ్రతాన్ని మొదలుపెట్టడానికి ఒక చోట చేరారు... ఎంత గొప్పవారికైనా శుభకార్యాలకు పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అలాగే తాము మొదలుపెట్టబోయే వ్రతానికి గతంలో చేసిన పాపాలు ఆటంకములవుతాయేమో అని సందేహించారు. మనము తెలిసీ తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకొని మరలా ఆ పాప కర్మల జోలికి పోకుండా ఉంటేనే ఈ వ్రతఫలం దక్కుతుంది ఆ కృష్ణుడి సేవాభాగ్యం లభిస్తుంది అని ఒక గోపిక చెప్పింది. అసలు కర్మంటె ఏమిటి అన్న చర్చ జరిగింది. ఎన్ని పాపాలు చేసినా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను దర్శించినంతనే కర్మలన్నియు మాసిపోతాయి అని ఉపనిషత్తులే చెప్పాయి. మన కర్మలకు ఫలాన్ని ఇచ్చేది భగవంతుడే కాని కర్మలు కావు.


మనము చేసిన పుణ్యకర్మల వల్ల సుఖము, పాపకర్మల వల్ల దుఖము లభిస్తుందని అనుకుంటాము కాని ఇది సరి కాదు. ఏ కర్మ చేస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందో అది పుణ్యకర్మ, ఏ కర్మ చేసినందువల్ల ఆగ్రహం లభిస్తుందో అది పాపకర్మ. పెద్దల ఆచరణను బట్టి మన ప్రవర్తనను దిద్దుకుని భగవంతుని అనుగ్రహానికి పాత్రులము కావాలి. అప్పుడే మనం గతజన్మలో చేసిన కర్మలు నిప్పులో వేసిన దూదిలా నశిస్తాయి. ఈ జన్మలో కర్మలు తామరాకు మీది నీటి బొట్టులా నిలవవు. మనం శ్రీమన్నారాయణుడే సర్వస్వమని నమ్మినవారము అందుకే భగవంతుడు మనను ఎల్లప్పుడూ సుఖంగా ఉండేలా చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు. గోదాదేవి శ్రీవ్రతము నిర్విఘ్నముగా జరగడానికి తమ కర్మలు తొలగి వారు కోరిన ఫలాన్ని పొందుటకు గల సులభమైన ఉపాయాన్ని చెప్తుంది గోపికలకు... శ్రీకృష్ణుడే ఈ వ్రతానికి అధినాయకుడు. అతని చేష్టలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. భగవంతునితో సంబంధం కలిగిన ఉత్తర మధురకు నాయకుడు. నిర్మలమైన జలముగల యమునా నదీ ఒడ్డున నివసించేవాడు, మనకొరకే యదుకులమున అవతరించిన మహానుభావుడు, తన పుట్టుకతో యశోధకు శోభను కలిగించిన మంగళమూర్తి. అందుకే మనము ఎటువంటి సందేహాలు లేకుండా నిర్మల మనస్సుతో వెళ్ళి పవిత్ర పుష్పాలను అర్పించి, నమస్కరించి, నోరారా కీర్తించి, ధ్యానించినంతనే గత, వర్తమాన జన్మలో చేసిన కర్మలన్నీ అగ్నిలో వేసిన దూదిలా భస్మమైపోతాయి. మన వ్రతానికి ఎటువంటి ఆటంకము కలగదు. అందుకే రండి ఆ భగవంతుని కీర్తిద్దాం.

ఇంతవరకు మొదటి ఐదు పాశురాలలో గోదాదేవి గోపికలను వ్రతానికి సన్నద్ధం చేసింది ఇక రే పటినుండి శ్రీవ్రతము లేదా తిరుప్పావై వ్రతము మొదలవుతుంది.


పాశురము - 4వ రోజు

 తిరుప్పావై --- 4 పాశురం


ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్

ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి

ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు

పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్

ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు

తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్

వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్

మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


రాగం: అమృత వర్షిణి


పర్జన్యదేవ! పాలింప రావా!

సంద్రమ్ముపై వ్రాలి సలిలములు త్రావి

ఆది దేవుని వోలె ఆతసీదేహుడవై

ఆకసము పైకెక్కి గర్జించుమా! //పర్జన్య//

సుందర బాహు అరవిందనాభు హస్తాన

చక్రమ్ము వలె మెరసి, శంఖమ్ము వలె ఉరిమి

శార్‌జ్ఞ నిర్ముక్త శర పరంపరగా

లోకమ్ము హర్షింప వర్షమ్ము కురియుమా!

మార్గశిర స్నానమ్ము చ్సి తరించెదము

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము


ఈ పాశురంలో గోదాదేవి మన సర్వస్వం ఆ భగవంతుడే అనే భావనతో ధనుర్మాస వ్రతం ప్రారంభిస్తే ఆతని వద్ద వినయవిధేయతలతో మెలిగిన దేవతలందరూ మనకు కూడా వశులైపోతారు అని నిరూపిస్తూ పర్జన్య దేవుడిని ఇలా ఆదేశిస్తుంది.. " గంభీరమైన స్వభావము కలిగి వర్షం కురిపించే మేఘదేవా! నీ దాతృత్వంలో ఏమాత్రం సంకోచించవద్దు. నీ ఔదార్యంలో ఇసుమంతైనా వెనకడుగు వేయకు. నడి సముద్రం మధ్యలోకి వెళ్లి అడుగు వరకు నీరంతా బాగా త్రాగి గర్జించు..తర్వాత మెల్లిగా గర్భిణీ స్త్రీవలె నిదానంగా మేడ మెట్లెక్కినట్లు పైకి వెళ్ళి ఆకాశమంతా వ్యాపించు. సమస్త జగత్తులకు కారణభూతుడైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నలుపును ధరించుము. అటుపిమ్మట ఆ భగవంతుని సుందరమైన విశాల దీర్ఘబాహువుల జంటలో కుడిచేతిలోని చక్రమువలె మెరుస్తూ, ఎడమచేతిలోని శంఖమువలె ఉరుముతూ, శ్రీమహావిష్ణువు చేతిలోని విల్లు శార్గము నుండి వెలువడే బాణములవలె వర్షధారలను కురిపించుము. ఆ వర్షధారలు లోకాన్నంతటినీ సుఖింపచేయగా మేము సంతోషంతో ఆ మార్గశిర స్నానం చేసి శ్రీవ్రతము చేస్తాము.


చూడడానికి ఈ పాశురం వర్షం కొరకు ప్రార్ధించినట్లు కనిపించినా అసలు అంతరార్ధం వేరే ఉంది. గోదాదేవి ప్రకృతిలో భగవంతుని , భగవంతునిలో ప్రకృతిని దర్శించింది. ప్రకృతిలో కాని అందమైన వస్తువులో భగవంతుని దర్శించకున్నా అందులో ఏదో లోతు ఉంటుంది. ఇందులో మనకు మేఘానికి, గురువుకు గల కొన్ని పోలికలు గోచరిస్తున్నాయి. మేఘము సముద్రంలోని ఉప్పునీటిని త్రాగి మనకు మంచి నీరును ఇస్తుంది. అదే విధంగా గురువు కూడా క్లిష్టమైన వేదార్ధాలను సరలము, సులభము చేసి మనకు అందిస్తారు. ఎడారి, పొలము, పల్లము, మెట్ట అనే తేడా లేక మేఘం అన్ని చోట్లా వర్షిస్తుంది. అలాగే గురువులు కూడా తన శిష్యులలో తక్కువవారు, ఎక్కువవారు, గుణవంతుడు, గుణహీనుడు, తెలివైన వాడు , తెలివిలేనివాడు అన్న తేడా లేకుండా అందరికీ విజ్ఞానమందిస్తారు. మేఘము , గురువులు ఇద్దరూ ప్రత్యుపకారాన్ని ఆశించరు. మేఘము తన నీరంతా ఇచ్చేసి వెలవెలపోతుంది. అలాగే గురువు తన విద్యనంతా ఇచ్చినా ఇంకా ఇవ్వలేకపోతున్నానే అని బాధపడతాడు. వర్షం ఏ చోట పడినా ఆయా స్థానాలను బట్టి ముత్యపు చిప్ప, తామ్రాకు, కాలినపెనం .. నీటి రూపం మారుతుంది. అలాగే గురువు అందరికీ సమానంగా బోధించినా శిష్యుల యోగ్యతలను బట్టి వేర్వేరు ఫలితాలనిస్తాయి. ఒక్కోరు ఒక్కో విధంగా వృద్ధిలోకి వస్తారు. మేఘుడికి ఉరుము, మెరుపు ఉన్నట్టే గురువుకు కూడా జ్ఞానము, ఆచరణ రెండూ ఉంటాయి. ఇద్దరూ పరిపూర్ణులే...

Monday, December 14, 2020

పాశురం - మూడవ రోజు

 తిరుప్పావై --- 3 పాశురం



ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


రాగం: కేదారగౌళ


పెరిగి లోకాలు కొలిచిన పురుషోత్తముని కీర్తించి

నోము పేరున కలిసి మేము నీరాడితే, దేశమంతా

నెల మూడు వానలు కురిసి ఈతిబాధలు తొలగు //పెరిగి //

పెరిగిన ఎఱ్ఱని వరిచేల పైకెగురు చేపలు

నీరజముల మెరసి నిదురించి తుమ్మెదలు

స్థిరముగ కూర్చుండి సిరములను లాగ

కలశములను నింపు కామధేనువులు

నిత్య సంపదలతో నిండుగా నుండు

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..



ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ శుభకార్యం జరిగినా పెద్దలు ఈ పాశురాన్ని చదువుతారు. త్రివిధ తాపములు (తాపత్రయములు) తొలగి అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. అంతే కాక ఈ పాశురంలో శుభప్రదమైన వామనావతారం ప్రస్తావన వస్తుంది. పూర్వము దేవతలను కాపాడటానికి శ్రీహరి వామనావతారం ఎత్తి పెరిగి లోకాలను తన కాలితో కొలిచిన పురుషోత్తముని కొలిచి నామసంకీర్తనం చేసి వ్రతస్నానం చేసినంతనే దేశమంతా నెలకు మూడు వానలు కురిసి, ఈతిబాధలు లేకుండా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండును. పచ్చగా పెరిగిన పంటచేలలోని నీటిలో చేపపిల్లలు త్రుళ్లి పడుతుండగా, కలువపూలలో మెరిసే తుమ్మెదలు నిద్రిస్తుంటే బాగా పెరిగిన వరిచేలు ఆనందాన్ని ఇవ్వాలి. గోపాలురు పాలు పితకడానికి కొట్టములలో ప్రవేశించి, స్థిరముగా కూర్చొని బలిష్టమైన పొదుగులను పిండగానే కుండలనిండుగా క్షీరధారలు కురిసే గోసంపద సమృద్ధి కావాలి. వామనుడు త్రివిక్రముడైనట్టు దేశమంతా నిత్య సంపదలతో, ఆనందంతో తులతూగాలని గోదాదేవి ఈ పాశురంలో కోరుకుంటుంది..


అహంభావియైన బలి వామనునికి ఇచ్చిన మూడు అడుగులు - అహంకారము, మమకారము, అవిద్య. అహంకారము పోవుట అంటే పరమాత్మకు సొంతమైనది అతనికే అర్పించడం. మనదంటూ ఏమీ లేదు అంతా ఆ భగవంతుడితే అని అర్ధం .. వామనావతారాన్ని కీర్తించి వ్రతస్నానాన్ని చేస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయట? ఏమిటా మూడు వర్షాలు ?1.అనన్య శేషత్వము (నీకే నీకే చెందినవాడను) 2. అనన్య శరణత్వము (నీవే నీవే నాకు ఉపాయము) 3. అనన్య భోగ్యత్వము (నీవే తప్ప అన్యము నాకు భోగ్యం కాదు). దీనినే అకారగ్రయజ్ఞానమందురు.ఈ జ్ఞానవర్షము కురిసినపుడు ఆత్మ పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ వ్రతఫలములో మరో విశేషము ఈతిబాధలు 1. అతి వృష్టి 2. అనావృష్టి. 3. ఎలుకలు 4. చిలుకలు 5. మిడతలు 6. క్రూరులైన రాజులు .. ఇవి తొలగిపోవును. ఈతిబాధలు తొలగి పంటలు విరివిగా పెరిగి ఆ వరిచేలలోని నీటిలో చేపలు సంతోషంతో త్రుళ్లిపడుచుండును. శ్రీహరిని చూసి ఆనంద పరవశులైన ఇంద్రాది దేవతలే ఆ చేపలు. భగవంతుని అనుగ్రహం పొందిన జీవులే సమృద్ధిగా పండి నీటితో నిండి వంగిన వరిచేలు. ఈ చేలలోని నీటి అడుగున కలువపూలు వాటిలో నిద్రిస్తున్న తుమ్మెదలు. ఈ పూవులు జ్ఞానుల హ్రదయాలు అందులో లక్ష్మీ సమేతుడైన నారాయణుడు తుమ్మెదలా ఉయ్యాలలూగుతున్నాడు. వ్రేపల్లేలోని పాడి అనగా గురువులు. పాలను పితుకువారు శిష్యులు. అనగా భక్తితో, స్ధిరముగా సేవించినపుడు గురువులు గోవులవలె సర్వ విద్యలను అందిస్తారు. అందుకే ఈ వ్రతము చేసినంతనే నిత్య సంపదలతో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని గోదాదేవి కోరుకుంటుంది..

పాశురము - రెండవ రోజు

 తిరుప్పావై --- 2 పాశురం



వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్

పైయత్తుయిన్ఱ పరమనడి పాడి

నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్

శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్

ఐయ్యముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి

ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్


చెలులందరికీ వ్రతం యొక్క విశేషాలు చెప్పిన తర్వాత గోదాదేవి ఆ వ్రత నియమాలను ఈ పాశురంలో వివరించింది.. భగవంతుని దర్శించుటకు వెళ్ళేవాళ్లు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శ్రీకృష్ణుడు అవతరించిన లోకంలో పుట్టి దుఃఖమయమైన జీవితం గడుపుతున్నా ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నవారలారా ఈ తిరుప్పావై వ్రతం కొరకు మేము ఏర్పరుచుకున్న వ్రత నియమాలు వినండి. ముందుగా పాలసముద్రంలో నిద్రించుచున్న శ్రీహరి యొక్క పాదపద్మములకు మంగళము పాడుదాము. ఈ వ్రతం ఆచరించు సమయంలో నేతిని, పాలను గాని తీసుకోము. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేసి కళ్లకు కాటుక ధరించక కేశములకు పరిమళాన్ని ఇచ్చే పూలను ధరింపకుండా ఉందాము. మా పెద్దలు విడిచిపెట్టిన చెడుపనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించే మాటలు, అసత్యాలు ఎప్పుడు గాని, ఎక్కడా గానీ మాట్లాడము. ఇతరులకు హాని కలిగించే కష్టములు కలిగించే పనులనుగాని, ఆలోచనలు గాని చేయము. మహాత్ములైన వారిని సేవించి ధనధాన్యాలతో సత్కరిస్తాము.


బ్రహ్మచారులకు, బిక్షువులకు బిక్ష పెడతాము. భగవంతుని గుణగణనము చేస్తూ ఈ సంసార బంధనాలనుండి విముక్తి పొండడం గురించి ఆలోచిస్తాం .. శాస్త్రముకంటే నిర్దిష్టమైన క్రమము కంటే భక్తి ప్రధానమైంది. భగవత్కృప, గురు కృప చాలా ముఖ్యమైనవని భావిస్తాము. దేవతలు మనపై కోపించినప్పుడు గురువు మనకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాడు. కాని గురువుకు కోపం వస్తే మనను రక్షించేవాడు లేడు. అందుకే గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా భావించాలని పెద్దలు చెప్పారు. శ్రీకృష్ణునిసేవకే అంకితమైనందున తన యవ్వనమంతా ఆ శ్రీకృష్ణుడి సొంతమని భావించిన గోడాదేవి ఈ పాశురంలో వ్రత నియమాలు చెప్పింది..


పాశురము - మొదటి రోజు

 మొదటి రోజు పాశురము:





మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్

కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్

ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం

కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .



మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమని చెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ “ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా” అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..