Sunday, August 11, 2024

మంత్రసహిత వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం


మంత్రసహిత వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం

సేకరణ, కూర్పు : గోగులపాటి కృష్ణమోహన్ 

శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 25న శుక్రవారం రాష్ట్రమంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.

మహా మాయారూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోక మాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్టఐశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను ప్రసాదించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. పరమ క్తితో పూజించినవారికి, కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మిగా కరుణించి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు.


పూజా సామాగ్రి..

పసుపు, కుంకుమ,

గంధం, విడిపూలు, పూల మాలలు,

తమలపాకులు, 30

వక్కలు, ఖర్జూరాలు,

అగరవత్తులు,

కర్పూరం,

చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు

మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,

అమ్మవారి ఫోటో,

కలశం,

కొబ్బరి కాయలు,

తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,

బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

ఇంట్లో ఉండే పూజా సామాగ్రి కూడా సిధ్దం చేసుకోవాలి వాటిలో

దీపాలు

గంట

హారతి,

ప్లేటు,

స్పూన్స్,

ట్రేలు,

నూనె,

వత్తులు,

అగ్గిపెట్టె,

గ్లాసులు,

బౌల్స్,

వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

పూజా విధానము

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో || అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

(మొదటి మూడు నామాలతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)

ఓం కేశవాయ స్వాహా                  

ఓం నారాయణాయ స్వాహా

ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః (చేయికడుగుకోవాలి)

విష్ణవే నమః మధుసూదనాయ నమః

త్రివిక్రమాయ నమః వామనాయ నమః

శ్రీధరాయ నమః                    

హృషికేశాయ నమః

పద్మనాభాయ నమః దామోదరాయ నమః

సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః              

అనిరుద్ధాయ నమః

పురుషోత్తమాయ నమః          

అధోక్షజాయ నమః

నారసింహాయ నమః              

అచ్యుతాయ నమః

జనార్ధనాయ నమః               

ఉపేంద్రాయ నమః

హరయే నమః                     

శ్రీకృష్ణాయ నమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః         

(అని పై నామములను స్మరింపవలెను)

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు

శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |

ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.

ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.

ప్రాణాయామము :

ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||

పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.

సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీశార్వరీనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, తిధౌ, వాసరే, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః …..(పేరు చెప్పాలి), గోత్రః ………(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంఛా పరిపూర్ణార్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే అధౌనిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.

(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షింతలు వేసి, లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||

కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|

ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||

అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|

ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||

కలశంలోని నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద ఆకుతో లేదా పుష్పంతో చల్లండి.

గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||

కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య

(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)

గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణికాయ నమః,

ఓం లంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓం ధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. అంటూ పసుపు విఘ్నేశ్వరుడి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి. అనంతరం

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!! అంటూ

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి……నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు! అంటూ …… వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


పూజ ప్రారంభము

వరలక్ష్మీదేవి ధ్యానం

నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే !!

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే

సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ||

అక్షింతలు వేయాలి

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి

దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః || ధ్యాయామి || ఆవాహయామి

అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి

సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం

సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి

రత్నసింహాసనం సమర్పయామి అక్షింతలు వేయాలి.

శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం

అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి రాగి/స్టీల్‌ పల్లేంలో నీళ్ళు వదలాలి

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం

పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి అమ్మవారిపై నీళ్ళు చల్లాలి

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం

గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి నీళ్ళు చల్లాలి

పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి పంచామృతం చల్లాలి

గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం

శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్ళు చల్లాలి

సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం సమర్పించాలి

కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా

విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి

ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి

తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం

మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః మాంగల్యం సమర్పయామి

అమ్మవారికి మాంగల్యం సమర్పించాలి

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభి రన్వితం

గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః గంధం సమర్పయామి

గంధం, కుంకుమ పెట్టాలి

అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తుండులాన్ శుభాన్

హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి

అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లాలి

మల్లికా జాజికుసుమైశ్చంప కైరపిర్వకుళైస్తతహా

శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే

శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి

అమ్మవారిని పూవులతో అలంకరించాలి

అధాంగపూజ:- పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః

శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీతర్థ్యం అష్టోతర శతనామావళి సమర్పయామి.

దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం

ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి

అగరవత్తులు/ధూప్‌స్టిక్ లేదా సాంబ్రాణి వేయండి, వెలిగించండి

ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం

దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి

(పూజ ప్రారంభంలోనే వెలిగించి ఉంటుంది కాబట్టి దీపం కుందిలో నూనె లేదా నెయ్యి మరోసారి వేయండి. దీపానికి నమస్కారం చేయండి)

నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం

నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి పిండి వంటలపై నీళ్ళు చల్లాలి

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం

పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి నీళ్ళు చల్లాలి

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

తాంబూలం తమలపాకు, వక్కలు, దక్షిణతో పెట్టండి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం

తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి

కర్పూరం వెలిగించాలి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా

మహాదేవ్యైచ విద్మహే, విష్ణుపత్నీచ ధీమహి!

తన్నో లక్ష్మీప్రచోదయాత్‌ !!

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి.

తర్వాతచే తిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా

త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన

శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి

నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే

పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి

తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వాయన విధి:

ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే

ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.

వాయనదాన మంత్రం:

ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ

ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః

** ఇతి పూజా విధానం సంపూర్ణం**


వ్రత కథా ప్రారంభం :-

వరలక్ష్మీ వ్రత కథ

కైలాస గిరిలో పరమేశ్వరుడు తన అనుచరగణంతో, ముని శ్రేష్టులతో ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎలాంటి వ్రతాలను, నోములను ఆచరించాలో సెలవివ్వండి అని కోరింది.

అందుకు పరమేశ్వరుడు సమాధానమిస్తూ స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతము.. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రత కథను శ్రద్ధగా వినాలి. వ్రతాన్ని ఆచరించినవారి మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి. వరలక్ష్మి కథను తెలియచేస్తానని పరమేశ్వరుడు వ్రతకథను వినిపించాడు..

పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉంది. ఆమె వేకువజామునే లేచి స్నానం ఆచరించి పువ్వులను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంటూఉండేది.

గృహ కార్యాలన్నీ స్వయంగా తానే చక్కగా చేసుకొనేది. చుట్టుపక్కల వారు. బంధువులతో చనువుగా కలసిమెలసి ఉండే ది. చారుమతి సద్గుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది. చారుమతీ.. నీ సత్ప్రవర్తన, సద్గుణాలకు ప్రసన్నురాలయ్యాను.. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం నాకు కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయని పేర్కొంది.

చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మి దేవికి ప్రదక్షిణలు చేసి స్తుతించింది. తెల్లవారిన తర్వాత భర్త, అత్త మామలకు తన కలలో అమ్మవారు చెప్పిన విషయమంతా.. వివరించింది. ఇరుగుపొరుగు స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని చాలా సంతోషించారు. అందరూ కలిసి వరలక్ష్మీదేవివ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నారు. అందరూ శ్రావణమాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం వేచి చూడ సాగారు. ఆరోజు చారుమతితో సహా ఇతర స్త్రీలందరూ వేకువజాముననే లేచి స్నానమాచరించి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందు గో మయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మండపాన్ని ఏర్పాటు చేసింది. ఆ మండపంలోకి వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది.

శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షివిష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ

అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోప చార పూజలు నిర్వహించింది. తొమ్మిది సూతాలు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయ సాదులను సమర్పించింది. అనంతరం మహిళలందరూ కలిసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు.

మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లుఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ల వైపు చూసుకుంటే గజ్జెలు, రెండో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవ రత్నఖచిత కంకణాలతో ప్రకాశించ సాగాయి. మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలం కార భూషణాలతో వెలిగిపోయారు. వారి గృహాలన్నీ సకలసంపదలతో కళకళలాడాయి.

వ్రతం పరి సమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తము లకు దక్షిణ తాంబూలాలను అందజేసి ఘనంగా సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోక ఉపకారం కోసం చారుమతి అందరితో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేసిందని అందరూ ఆమెను కీర్తించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టారని వేదపండితులు తెలిపారు.


** సంపూర్ణం **


సేకరణ, కూర్పు 


గోగులపాటి కృష్ణమోహన్ 

అధ్యక్షుడు 

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం 

సరారం కాలని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 

మేడ్చల్మల్కాజిగిరి జిల్లా 

మొబైల్ నెంబర్ 9700007654