Tuesday, September 24, 2024

దసరా నవరాత్రులు (శరన్నవరాత్రోత్సవాలు)

 శ్రీ క్రోధినామ సంవత్సర శరన్ననవరాత్రి ఉత్సవాల వివరాలు 2024 


శ్లోకం:

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ

సప్తమం కాలరాత్రితి మహాగౌరీతి చాష్టమమ్

నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః


*03-10-2024 గురువారం*

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి,

దుర్గాదేవి


శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం|| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్||


1 శైలపుత్రి: దుర్గా శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతి శూలాన్నీ చేత బట్టి ఎద్దువాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. 


ఈ రోజు శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవి అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధికలుగుతుంది.

దుర్గాదేవికి శ్రీశైల సంప్రదాయం ప్రకారం కదంబం (సాంబారు అన్నం), మినప వడలు, రవ్వకేసరి, పానకాన్ని అమ్మవారికి సమర్పించి తల్లి ఆశీర్వాదాలు పొందుతారు


ఈ రోజున అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం. 



*04-10-2024, శుక్రవారము*

ఆశ్వయుజ శుద్ధ విదియ

బాలా త్రిపుర సుందరి


2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. 


రెండో రోజు.. అమ్మవారు బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.


 రోజు బంగారు వర్ణ వస్త్రంతో అలంకరిస్తారు. బంగారు రంగు చెడు శక్తులను తొలగిస్తుందని విశ్వాసం


శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా || 



*05-10-2024, శనివారము*

ఆశ్వీయుజ శుద్ధ తదియ

,*శ్రీ గాయత్రి దేవి*,


3. చంద్రఘంట: అమ్మవారి మూడవఅవతారం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటంవల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణు జొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.


మూడో రోజు.. చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు..


ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఆటంకాలు తొలగించి సకల శుభాలనిచ్చే రంగు ఇది. 


శ్లో| lపిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా! 

ప్రసాదంతనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా||



*06-10-2024, ఆదివారము*

ఆశ్వీయుజ శుద్ధ చవితి

అన్నపూర్ణదేవి


4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.


నాలుగో రోజు.. అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. భక్తులను అనుగ్రహించే దేవికకి గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడతారు.


ఈరోజు అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టి అలంకరించాలి. 


శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చl

దధానాహస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||



*07-10-2024, సోమవారం*

ఆశ్వీయుజ శుద్ధ పంచమి

లలితా దేవి


5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారంస్కందమాత. స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందునితల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.


ఐదో రోజు.. లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పిస్తారు.


అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు.


శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| 

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||



*08-10-2024, మంగళవారం*

ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి 

 శ్రీ మహాలక్ష్మీ


6. శ్రీ కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీ మాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.


ఆరో రోజు.. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిని గులాబీరంగు వస్త్రంతో అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి సమర్పిస్తారు.


శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ||



*09-10-2024, బుధవారం*

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి

సరస్వతి


7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చీకటివలె నల్లగాఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమెవాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడాపిలుస్తారు.


ఏడో రోజు.. జగన్మాత సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.


మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు.


శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీకర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వరమూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||



*10-10-2024, గురువారం*

ఆశ్వీయుజ శుద్ధ అష్టమి

దుర్గాదేవి


8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.


ఎనిమిదో రోజు.. దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.


ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరిస్తారు.


శ్లో||శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| 

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా|| 



*11-10-2024, శుక్రవారం*

ఆశ్వీయుజ శుద్ధ నవమి (మహార్నవమి)

మహిషాసురమర్దిని


9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్నిసిద్ధులనూ ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులనుఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.


తొమ్మిదో రోజు.. మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యంగా రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.


అమ్మవారికి నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నీలం రంగు యుద్ధానికి సంకేతం అని..ఈ రంగు వస్త్రం ధరించి మహిషాసురుడిని అమ్మవారు సంహరించారని చెబుతారు.


శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానాసదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||


*12-10-2024, శనివారం*

ఆశ్వీయుజ శుద్ధ దశమి

శ్రీ రాజరాజేశ్వరి దేవి

పదో రోజైన విజయదశమినాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువుతీరుతుంది.

ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం

 నైవేద్యంగా సేమ్యా పాయం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం సమర్పిస్తారు.

శరన్నవరాత్రి మరియు దషర శుభాకాంక్షలతో

గోగులపాటి కృష్ణమోహన్