Thursday, September 26, 2019

శరన్నవరాత్రి అమ్మవారి పూజ

*ఆశ్వయుజ మాసం, విజయ దశమి*
29.09.2019 ఆదివారం

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం ఆశ్వయుజ మాసం అగును. ఆశ్వయుజానికి మరోపేరు ఇష మాసం.

హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

మనసు నిర్మలం కోసం మహర్షులు ఉపదేశించిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైంది. ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. శరద్రుతువులో ఈ మాసం వస్తుంది. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకునే ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది.
శరత్కాలంలోని తొలి పది రోజుల్లో జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించి, విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శరద్రుతువులో కాచే వెన్నెల కాంతి, చల్లని చూపు, మందహాసం, ముఖపద్మం కలిగినదిగా పరాశక్తిని అభివర్ణిస్తారు. శరత్కాలంలో ఆవిర్భవించడంతో పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. అందుకే అమ్మ జగన్మాతని ఉపాసించే కాలాన్ని శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలుగా జరుపుకుంటారు.

నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు పార్వతి,
మధ్య మూడు రోజులు లక్ష్మీ,
చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.
ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. అనారోగ్యాన్ని కలిగించి, ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు గురికాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం.
హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దశహరా అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను పొగొట్టేది అని కూడా అర్థం.

నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని నమ్మకం. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితం పొందుతారు. దశమి రోజున వేద పండితులు, బ్రాహ్మణులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది.

నవరాత్రి ఉత్సవాల్లో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి, దేవీ స్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసేదే కుమారీ పూజ. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో ప్రత్యేకంగా పూజిస్తారు.

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు.

ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు
శైలపుత్రి- గాయత్రీదేవి,
చంద్రఘంట-అన్నపూర్ణ,
కూష్మాండ-మహాలక్ష్మి,
స్కందమాత- లలితాత్రిపురసుందరి,
కాత్యాయిని- సరస్వతీదేవి,
కాలరాత్రి-దుర్గాదేవి,
మహాగౌరి-మహిషాసురమర్దని,
సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి కొలుస్తారు.

విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కోదేవతగా జగన్మాతను ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు.
శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది.


29.09.2019
ఆదివారం
పాడ్యమి
*తొలిరోజు*.
శారదా నవరాత్రులు ప్రారంభం,
గౌరీ వ్రతం.

శైలపుత్రి
శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీవ్రత!.

నవరాత్రుల్లో మొదటిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.


30.09.2019
సోమవారం.
విదియ
*రెండో రోజు*-
చంద్ర దర్శనము.

బాలాత్రిపుర సుందరీ
శ్లోకం: హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!.

రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.


01.10.2019
మంగళవారం.
తదియ
*మూడో రోజు*-
తదియ+చవితి తిథి ద్వయం.

గాయత్రీదేవి
శ్లోకం: ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే!.

వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం.
మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది.
‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.


02.10.2019
బుధవారం
చవితి
*నాలుగో రోజు*-
ఉపాంగ లలితాగౌరి వ్రతం, పంచమి తిథి, నాగ పూజ.

అన్నపూర్ణాదేవి
శ్లోకం: ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ, నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ; సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ!.

నాలుగవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.


03.10.2019
గురువారం
పంచమి
*ఐదవ రోజు*

లలితా త్రిపుర సుందరీదేవి
శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్‌; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌!.

ఐదో రోజున త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో (లలితా త్రిపుర సుందరీదేవి)  దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.


04.10.2019
శుక్రవారం
షష్టి
* ఆరో రోజు*
సరస్వతి పుస్తక రూప వ్రత ఆరంభం.

మహాలక్ష్మీ
శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!.

ఆరో రోజు రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మిీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.


05.10.2019
శనివారం
సప్తమి
*ఏడో రోజు*.
దేవి త్రిదాత్ర వ్రతం

సరస్వతీదేవి
శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా!.

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. ఏడో రోజున జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చును. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.


06.10.2019
అదివారం
అష్టమి
*ఎనిమిదో రోజు*-
దుర్గాష్టమి (మహాష్టమి)

దుర్గాదేవి
శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.

ఎనిమిదో రోజు దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.


07.10.2019
సోమవారం.
నవమి
*తొమ్మిదో రోజు*.
పుస్తక రూప సరస్వతి ఉద్వాసన, మహానవమి (దశమి తిథి).

మహిషాసురమర్దినీదేవి
శ్లోకం: మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ!.

తొమ్మిదవ రోజున మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చును. నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.


08.10.2019
మంగళవారం
దశమి
*పదవ రోజు*
సోమపదం విజయ దశమి, అపరాజిత దేవి పూజ, శమీ పూజ, దశరథ గౌరీ వ్రతం, దుర్గాదేవి ఉద్వాసన, ద్విదళ వ్రతం ప్రారంభం.

రాజరాజేశ్వరీదేవి
శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

పదవ రోజు శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.

*శుభమస్తు.*

No comments:

Post a Comment