Thursday, December 17, 2020

పాశురము - 12వ రోజు

 తిరుప్పావై --- 12 పాశురం



కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి

నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర

ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్

పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి

శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త

మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్

ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్

అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్


రాగం : రేవతి


లేగలను తలచి జాలిగొని అరచి

ఎనుములు సిరములు పాలుధారగ కురియ

వీడెల్ల నాని చిత్తడి ఆయనే చెలియ!

మేటి సంపదలున్న మొనగాడి చెల్లెలా!

మంచు మాతలలపై పడగ నీ వాకిలి పట్టి

కోపమున రావణుని కూల్చిన శ్రీరాముని

కీర్తింపగ, పెదవి కదపవేమె కలికి!!

మాయ నిద్రను వీడి మేలుకోవమ్మ!

నీ సంగతులు తెలిసె లే! బంగారు బొమ్మ

జగతికే మంగళం కూర్చు మన శ్రీ వ్రతము


నిన్నటి పాశురంలో గోపాలురు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని ఆచరించేవారని చదువుకున్నాం కదా. ఈరోజు ఆ స్వధర్మం కూడా అవలంభించని ఓ గోపిక గురించి తెలుసుకుందాం. ఈ గోపికనే గోదాదేవి, ఇతర గోపకాంతలు మేల్కొల్పుతున్నారు. ఈమె స్ధితప్రజ్ఞత అవస్ధలలోని తొలిదశ యతమానావస్ధలో ఉంది. తాబేలు తన అవయవములను మొత్తం లోపలికి లాక్కుని ఉంటుంది అదేవిధంగా ఈ గోపిక వలెనే ఇంద్రియములను ఇంద్రియ విషయములనుండి పూర్తిగా ఉపసంహరించినవాడే స్ధితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గోపిక శ్రీకృష్ణుడి ఆప్తమిత్రుడు శ్రీదాముని సోదరి. అతను కృష్ణు డి సేవలో పూర్తిగా మునిగిపోయి తన ఇంటిలోని గేదెల పాలు కూడా పిండడం లేదు. ఆ గేదెలు తమ పాలు పిండేవారు లేక తమ లేగదూడలు కూడా పాలు త్రాగకపోవడంతో పొదుగుల బాధతో అరుస్తూ వాటిని తలుచుకుంటూ పాలను నేలపై స్రవించాయి. ఆ పాలతో ఇల్లంతా చిత్తడిగా మారింది. ఈ వేకువజామున మంచు మా తలలపై కురుస్తున్నా నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటివాకిట నిలబడ్డాము. బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిటి పై దండెను పట్టుకొని నిలబడ్డి తన భార్యను అపహరించిన ఆ లంకాధీశుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము. అది విని కూడా నీవు పెదవి విప్పడంలేదు. ఇదేమి గాఢనిద్ర?. లేచి రావమ్మా ఇప్పటికే ఇరుగుపొరుగు వాళ్లు కూడా వచ్చి నీ నిద్రను చూస్తున్నారు.


గేదెలు దూడలకై చేపు వచ్చి అరుస్తున్నాయి. తమను తాము పోషించుకోని వారు లేగదూడలవంటివారు. ఆవులు, గేదెలు ఉదారులైన గురువులు. ఈ గేదెలకు సమృద్ధిగా పాలు ఉండడమంటే వారికి భగవదనుగ్రహం సంపూర్ణంగా ఉండడం. కట్టి ఉంచిన దూడలు తమ తల్లి వద్దకు చేరుకోలేనట్టే జీవుడు తన కర్మపాశంతో, అవిద్యతో ఈ శరీరమనే దుంగకు కట్టబడ్డాడు. దానిని వదిలించుకుంటే గాని భగవంతుని చేరలేడు. అతనిని ఆ పరమాత్మ వద్దకు చేర్చేవాడే గురువు. క్రింద నేలంతా బురదగా మారి పైన మంచు కురుస్తుంది. భగవంతుని అనుభవప్రవహమే ఈ నేలపై ఉన్న తడి, మంచు ఆళ్వారుల దివ్య సూక్తులు. భగవంతుని అనుభవంలో చేరడానికి సాయం చేసే దివ్యమంత్రమే అష్టాక్షరి. ద్వారం మీద ఉన్న దండెను పట్టుకుని ఈ గోపికలు రావణాసురుని చంపిన రాముడి గుణగానం చేస్తున్నారు. రావణుడు పాలించిన లంకయే మన శరీరము కాగా ఆ రావణుడే మన మనస్సు. దశేంద్రియాలే ఆతని పది తలలు. మనస్సును నిగ్రహించుకుని సీత(ఆత్మ) ను తనలో చేర్చుకున్నాడు శ్రీరాముడు. అందుకే ఆతని కీర్తిస్తున్నారు.

పాశురము - 11వ రోజు

 తిరుప్పావై --- 11 పాశురం



కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు

శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం

కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే

పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్

శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-

ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ

శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-

ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎన్బావాయ్


రాగం: కేదారగౌళ


వేల లేగదూడల ఆవుల పాలు వేగ పిడికెడువారు

అరుల బలము అణగ పోరు సైపెడువారు

దోషమించుక లేని గోప వంశస్వర్ణలతా!

పుట్టలోని పాము బోలు కటికల వనమయూరీ!

రావే! వయ్యారీ! రావే! శ్రీమంతురాలా! //లేగదూడల//

చుట్టాలు చెలులూ అందరు నీ ముంగిట నిలచీ

నీలమేఘ శ్యామ సుందరుని కీర్తింప

ఉలుకవు పలుకవు నీ నిద్రకర్ధమేమి?!

చెలియరో చెప్పవే - వేగ మేల్కొనవె

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము..



ఈరోజు నిద్ర మేల్కొల్పే గోపిక కులంలో, గుణంలో, అందంలో మిన్నయైనదై కృష్ణుడివలెనే వ్రెపల్లెలో అందరి మన్ననలను పొందింది. భగవంతుని కైంకర్యమే ఐశ్వర్యంగా భావిస్తుంది ఈ గోపిక. వివిధములైన ధర్మములను ఆచరిస్తూ వాటి ఫలితములకోసం ఎదురుచూడక అవి భగవదారాధనా రూపాలని భావిస్తుంది.



ఈ గోపికను గోదాదేవి ఇలా మేల్కొపుతుంది. "లేగదూడలు కల ఆవులైనా దూడలవలె ఉన్న పలు ఆవుల మందల పాలు పితికేవారు, శత్రువులను బలాన్ని నశింప చేయడానికి యుద్ధం చేసేవారు, ఎట్టి దోషము లేనివారైన గోపాలవంశాన జన్మించిన ఓ స్వర్ణలత! పుట్టలోని పామువలె నున్న నడుము గలదానా! వనమయూరీ! సంపన్నురాలా! రమ్ము. చుట్టాలు, చెలికత్తెలు అందరూ వచ్చారు.. నీలమేఘశ్యాముడైన ఆ శ్రీకృష్ణుని నామాలను గానం చేస్తున్నారు. అయి నా నీవు ఉలకవు. పలకవు. దేనికోసం ఇంతగా నిద్రిస్తున్నావో చెప్పమ్మా!"



వ్రేపల్లెలోని ఆవులు దూడలు కలిగి ఉన్నా కూడా శ్రీకృష్ణుని వేణుగానము, స్పర్శచే సమృద్ధిగా పాలు ఇస్తున్నాయట. ఆ గోవులే సంసారబంధం వదిలిపెట్టిన ముక్తపురుషులు. వారి వయస్సు ఎప్పటికీ 25 ఏళ్లే.. ప్రకృతితత్వాలు 24 కాగా ఇరవై ఐదవది జీవతత్వము. ప్రకృతితత్వాలను దాటుకుని స్వస్వరూపంలో ఆవిర్భవించినవాడు ముక్తపురుషుడు. అలాగే భగవంతుడే కాక భాగవత్ శేషత్వాన్ని కలిగి ఉండడవల్ల ఈ గోపిక ధృఢమైన బంగారు తీగవలె కనిపిస్తున్నదట. ఆ గోపిక పడుకున్న తీరు ఎలా ఉందంటే పుట్టలోని పాములాంటి నడుము కలిగి ఉన్నది. మన శరీరంలోని మూలాధారంలో కుండలినీ శక్తి పుడుతుంది. ఈ కుండలినీ సర్పం ఆకారంలో 3 1/2 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. దీనిని మూలాధారం నుండి కదిలించి పైన శిరస్సులో ఉన్న సహస్రార చక్రంలో ప్రకాశింపచేయాలి. ఆమె కేశాలు నెమలి పురివిప్పినట్టుగా ఉన్నాయి . శ్రీవిద్యా సంప్రదాయం తెలిసి, హఠయోగంలో ప్రాణాయమం చేసే యోగులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ పాశురంలో చెప్పబడిన గోపాలవంశంవారు తమ సంపదనంతా భగవంతుడు, భాగవత్ కైంకర్యానికే వినియోగించేవారు. అట్టి వంశానికి చెందిన గోపికను ఈ రోజు మేల్కొలిపి తమతో పాటు శ్రీవ్రతాన్ని ఆచరించడానికి తీసికెళ్లారు.

పాశురము - 10వ రోజు

 తిరుప్పావై --- 10 పాశురం



నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం

తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో

ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే

తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్


రాగం: పూరీ కళ్యాణీ


నోచి స్వర్గభోగముల తేలేటి ఓ తల్లి!

తలుపు తీయకున్నావు! మాటయిన అనరాదా

తులసి కిరీటధారి నారాయణుని మనము

సేవించితే చాలు - పరనొసగు పుణ్యమూర్తి

ఆనాడు శ్రీరామునిచే మృత్యువు వాతబడిన

కుంభకర్ణుడు ఓట్ అతని గాఢ నిద్ర నీకొసగెనా?

నిద్రమత్తుని వీడి ఓ నీలవేణి!

తెప్పరిల్లుచు వచ్చి తలుపు తీయగరావె!

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.



ఈరోజు నిద్ర మేల్కొలిపే గోపిక శ్రీకృష్ణుని పొరుగింటి పిల్ల. ఈమె తనకు తానుగా కృష్ణుడికోసం ఎదురు చూసేది కాదు. ఆ కృష్ణుడే తన వద్దకు వస్తాడనే నమ్మకం కల చిన్నది. ఈ గోపిక ఫలితం వచ్చినా రాకున్నా దాని వల్ల వచ్చే లాభనష్టాలన్నీ భగవంతుడివే కాని తనవి కావనే నిశ్చింతతో నిద్రపోతుంది. నిద్రపోతున్నప్పుడు మనసు తప్ప ఇంద్రియాలన్నీ పని మానేస్తాయి. కాని ఆ మనసు మాత్రం పరమాత్మనే తలుచుకుంటూ ఉంటుంది. అలా నిద్రపోతున్న గోపికను గోదా, మిగిలిన గోపికలు కాస్త వ్యంగ్యంగా మేల్కొల్పుతున్నారు.


"ఏమమ్మా! మాకంటే ముందే నోము నోచుకుని స్వర్గంలోకి ప్రవేశించావా? పోనీ వాకిలి తెరవకున్నా పర్లేదు. ఈ ఒక్క మాటైనా చెప్పు. పరిమళించే పవిత్రమైన తులసీదళాలు ధరించిన నారాయణుడు మాచే వేనోళ్ల కొనియాడబడి మాకు పురుషార్ధాన్ని ఇస్తున్నాడు కదా. ఆ రామచంద్రుని మూలంగా మృత్యువు నోటిలోకి త్రోయబడిన కుంభకర్ణుడు నీతో అతని గాఢనిద్రను పణంగా పందెం కాచి ఓడిపోయి నీకు ఇచ్చి వెళ్ళాడా? చెప్పమ్మా! మరీ ఇంత మొద్దు నిద్దరైతే ఎలాగమ్మా? మాకందరికి అరుదైన శిరోభూషణమైనదానివి నీవే కదా తల్లీ. ఇకనైనా నిద్ర లేచి వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు....

ఇక్కడ స్వర్గమనగా భగవదనుగ్రహం. ఆనందము. భగవంతునితో కలిసి ఉండడమే స్వర్గంతో సమానం. అంతేకాక ఈ పొరుగింటి గోపిక కోసం ఆ శ్రీకృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట.. ఒకరిని పొండడానికి ఒకరు వ్రతం చేస్తున్నారు. అందుకే ఆ దేవదేవుడు ధరించే తులసీమాలల సౌరభాలు బయటకు కూడా వస్తున్నాయి. ఆ పరమాత్మ వద్దకు వెళ్లి మనమేమీ అడిగే పని లేదు. మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. మనకు కావలసిన వన్నీ తానే తెలుసుకుని ఇస్తాడు.

పాశురము - 9వ రోజు

 తిరుప్పావై --- 9 పాశురం



తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్

దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం

మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్

మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్

ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో

ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో

మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు

నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్


రాగం : అమీర్ కళ్యాణి


మేలి రతనాల మేడలో చుట్టూ దీపాలు వెలుగ

ధూపాలు వీవ, మేలితల్పాన నిదురించు

మా మామ కూతురా! మణితలుపు గడి తెరువు // మేలి రతనాలు //


అత్తా! ఆమెను లేపవమ్మా! నీ తనయ

మూగదా లేక చెవిటిదా? అలసినదా?

కావలి ఉంచిరా! మంత్రము వేసిరా!

మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా! అని

పలు తిరునామములు అనుసంధించుము - ఆమె మేల్కొనగ

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము..


ఇంతకుముందు రెండు పాశురాలలో శ్రవణం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది. 8 - 12 పాశురాలలో మననం, ధ్యాన ప్రాముఖ్యం గురించి నిరూపించబడింది. అట్టి ధ్యానంలో పరాకాష్ట చెందిన గోపికను ఈనాడు మేల్కొపుతున్నారు..


నీ మేడ ఉజ్వలము, పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. ఆ మేడలో మెత్తని పాన్పుపై కళ్ళుమూసుకుని హాయిగా నిద్రపోతున్నావు. నీ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి. అగరుధూపాల పరిమళాలు వ్యాపించాయి. ఇంకా నిద్రపోతున్న ఓ అత్త కూతురా! లేచి మణికవాటము యొక్క గడియను తీయుము. అత్తా! నువ్వైనా ఆమెను లేపరాదా? ఏం? నీ కూతురు మూగదా? లేక చెవిటిదా? లేక అలిసిపోయి ఉన్నదా? ఎవరైనా నువ్వు కదిలితే మేము ఊరుకోము అని కట్టడి చేసి కాపలాగా ఉన్నారా? అలా మొద్దు నిద్రపట్టేట్టుగా ఎవరైన మంత్రం వేసారా?అయితే మాధవా! మాయావీ! వైకుంఠవాసా! ఆని ఆ నారాయణ నామస్మరణ చేసి ఆమెను మేల్కొలుపు. ఆమె లేచి మాతో వచ్చి చేరుతుంది. అని గోదాదేవి గానం చేసింది.


ఈనాటి గోపిక స్థితి వశీకావస్థలో ఉంది. భగవంతుదే సర్వస్వం అని తెలుసుకున్నదై ఆతని చేరడానికి ఆరాటపడక స్వప్రయత్నం పూర్తిగా వదిలిపెట్టి ఏ పనీ చేయక మూగ, చెవుడు కమ్మినట్టుగా గాఢనిద్రలో ఉంది. ఆ మేడ పరిశుద్ధమైన నవరత్నాలతో నిర్మించబడింది. భగవంతునితో జీవునికి గల సంబంధాలు కూడా తొమ్మిది విధాలు. 1.తండ్రి. 2. రక్షకుడు 3. శేషి. 4. భర్త. 5. జ్ఞేయుడు 6. స్వామి 7. ఆధారము 8. ఆత్మ 9.భోక్త.. ఈ నవవిధాలతో పరమాత్మను కూడి ఉండడమే ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞలో స్థిరంగా ఉండడమే స్తితప్రజ్ఞత. ఆ మేడలో దీపాల వెలుగుతో పాటు అగరు ధూపం పరిమళిస్తుంది. జ్ఞానం దీపంవంటిది కాగా ఆచరణ సుగంధం వంటిది. ఈ రెండు కలిగినవారికి ఆ భగవదనుగ్రహం సులువుగా లభిస్తుంది. ఈనాటి గోపిక సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని కూడా వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవంతుని నిలుపుకుని వశీకావస్థలో ఉంది. గోదాదేవి ఇతర గోపికల భగవన్నామస్మరణలు విని లేచి బయటకు వచ్చి వాళ్లతో కలిసింది.

పాశురము - 8వ రోజు

 తిరుప్పావై --- 8 పాశురం



కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు

మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం

పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -

క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ

పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు

మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ

దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్

ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్


రాగం: చక్రవాకం


తూరుపు తెలవారె నెచ్చెలీ మేలుకో!

ఎనుములు చిరుబీడుకు మేయగా ఏగెనే

బాలికలందరు అదే పోతగా పోతుంటే

ఆపి, నిను పిలువగా వచ్చి నిలచి నామమ్ము // తూరుపు //

శ్రీకృష్ణు కీర్తించి పరవాద్యమును పొంద

కేశినోటిని చీల్చి, మల్లుర నణచిన

దేవదేవుని చేరి సేవించి నిలువగా

అయ్యో! మీరే వచ్చిరా అనుచు కటాక్షించు..

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


ఈరోజు నిద్రలేపబోయే గోపిక కృష్ణుడికి కూడా ఆసక్తి కలిగించే విలాసవతి. కృష్ణుడి దగ్గరకు నేనెందుకు వెళ్లాలి? అతటే నా దగ్గరకు రావాలి అనే ధీమాతో పడుకుని ఉంది. పరమాత్మ మీద అంత అచంచలమైన విశ్వాసం ఉన్న ఆమె తమ తోడు లేకుంటే ఈ వ్రతం ముందుకు సాగదని తెలిసిన గోపికలు ఆమెను మేల్కొల్పుతున్నారు.


తూరుపు దిక్కున తెల్లని కాంతి వ్యాపిస్తుంది. మేతకు విడిచిన గేదెలు అన్ని దిక్కులకు వెళ్ళనారంభించాయి. మనతోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్లాలని బయలుదేరారు. శ్రీకృష్ణునివద్దకు వెళ్ళడం చాలా ముఖ్యమని భావించి వారందరూ అలా వెళ్తున్నారు. అలా వెళ్ళెవారిని నిలిపి మరీ నిన్ను పిలవడానికి నీ గుమ్మం ముందు నిలబడ్డాం. కుతూహలంగల ఓ పిల్లా తొందరగా నిద్ర లేచిరా!!. ఆ కృష్ణుని గుణగానము చేసి వ్రతానికి చాలా అవసరమైన పర అనే సాధనాన్ని సంపాదించి, కేశి అనే రాక్షసుని సంహరించి, చాణూర ముష్టికులనే మల్లయోధులను చంపిన ఆ భగవంతుని సమీపించి సేవించినపుడు అతడు మెచ్చుకుని "అయ్యో! మీరే వచ్చారా " అని బాధపడి మనను పరిశీలించి మన కోరికను నెరవేరుస్తాడు. కనుక వెంటనే లేచి రా" అని ఆ గోపికను మేల్కొలుపుతున్నారు.


సూర్యోదయానికి ముందు తూరుపు తెల్లబడటం అనగా మనలో సత్వగుణము ప్రభవించి, రాజస తామస భావాలు తగ్గడం. అదే జ్ఞానోదయానికి ముందు కలిగే మానసిక పశాంతత. భక్తులందరూ సాధారణంగా భగవంతుడిని మేల్కొలుపుతారు. కాని గోదాదేవి మాత్రం భగవంతుని ప్రియ భక్తులను మేల్కొలుపుతుంది. శ్రీకృష్ణుడు కేశి అనే రాక్షసుని చంపాడని కీర్తిస్తున్నారు. ఈ కేశి అనేది అహంకారము. మనలోని అహంకారం, మమకారాలను పట్టి చీల్చవలసింది ఆ పరమాత్మే కదా.. అదే విధంగా మనలోని కామ క్రోధాలనే మల్లురను కూడా ఆ దేవదేవుడే తొలగించాలి. పరమాత్మను మేము ప్రత్యక్షంగా చూసామని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందినవాళ్లే. కాని ముదలాళ్వార్లు ముగ్గురు, పెరియాళ్వార్లు మున్నగువారు ఆ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా దర్శించారు. అలాగే మొన్నా, నిన్నా, ఇవాళ మేల్కొన్న గోపికలు ముగ్గురూ భగవదనుభవంలో మునిగి ప్రపంచాన్ని మరచి సుషుప్తిలో ఉండిపోయారు.

Tuesday, December 15, 2020

పాశురము - 7వ రోజు

 తిరుప్పావై --- 7 పాశురం



కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు

పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే

కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు

వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్

ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో

నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి

కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో

తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.



కీశూకీశు మనుచు ఏటిరింతలు కలసి

ఊసులాడెనదె! వినలేదా వెర్రిదానా!

కాసుల పేరుల, కొప్పుల ఘుమఘుమలు

కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా //కీశుకీశు//

గోపికా నాయకీ! నారాయణుని మూర్తి

కేశవుని నామములు పాడగా వింటివా? పరుంటివా?

తేజోవతీ లేచి తెరువవే తలుపు

జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.


నిన్న ఒక గోపికను మేల్కొల్పడంలో శ్రీవ్రతం మొదలైంది కదా. ఈరోజు శ్రవణము లో వైవిధ్యమును వివరిస్తూ ఇంకో గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. వేదపఠనము, శుభకార్యము మొదలుపెట్టేటప్పుడు శ్రీ గురుభ్యోనమః, హరిః, ఓమ్ అని ప్రారంభిస్తారు. నిన్న పక్షుల శబ్దములు, శంఖనాదము, హరి హరీ అనే ధ్వనులు వినలేదా అని గోపికను అడిగారు. దీనివలన గురువును, హరిని తలుచుకున్నట్టుగా భావించాలి. ఈ పాశురంలో భగవన్నామ శ్రవణంలో గల ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుఝామునే లేచి అన్ని వైపులలో ఉన్న పక్షులను కలుపుకుని మాట్లాడుతున్నాయి. ఆ ధ్వని నీకు వినపడలేదా? ఓసి పిచ్చిదానా! పువ్వులు ముడిచిన కొప్పులు విడిపోగా పరిమళాలు వెదజల్లుతున్న గొల్లభామలు కవ్వముతో పెరుగు చిలుకుతుంటే వారి గాజుల గలగలలు, వారి మెడలోని ఆభరణాల ధ్వని, మంగళసూత్రముల చప్పుడు, వారు చిలుకుతున్న పెరుగు సవ్వడి నీకు వినపడలేదా? ఓ నాయకురాలా! ప్రపంచమంతా తన ప్రేమ వాత్సల్యాలతో వ్యాపించియున్న పరమాతం మనకు కనపడాలనే మానవదేహాన్ని ధరించి శ్రీకృష్ణుడై అవతరించాడు. లోకకంటకులైనవారిని సంహరించిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తిస్తుంటే కూడా నీకు వినపడలేదా? విని కూడా మేల్కొనడంలేదా? నీ తేజస్సు మాకు అగుపిస్తున్నది. లేచి ఇకనైనా తలుపు తెరువుము అని మేల్కొలుపుతున్నారు ...


భరద్వాజ పక్షులు మామూలు పక్షులు కావు. వాటి మాటలు మామూలు మాటలు కావు. ప్రయాణానికి పోయేవాళ్ళు త్రోవలో తినడానికి మూటకట్టుకున్నట్లు ఈ పక్షులు ఉదయాన్నే లేచి పగలంతా కలిగే ఎడబాటులో తమకు తోడుగా ఉండడానికి, గుర్తుచేసుకోవడానికా అన్నట్టు ముచ్చట్లాడుతున్నాయి. ఆ మాటల ధ్వని వినపడలేదా అని గోదాదేవి అడుగుతుంది. వ్రేపల్లెలో గోపికలకు పెరుగు చిలకడం అనేది నిత్యకృత్యం. ఎంతటివారైనా తమ నిత్యకృత్యములను ఎప్పుడూ మరచిపోరాడు. వీడరాదు. చల్ల చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ తన్మయులై ఉన్న గోపికల కొప్పులు ఊడిపోయి పూవులు జారిపోయి వాటి పరిమళాలు వ్యాపించాయి. వారి ఆభరణాలు, చేతి గాజులు గల్లుగల్లుమంటూ చప్పుడు చేస్తున్నాయి. అమృతాన్ని సాధించడానికి ఆనాడు దేవతలు, రాక్షసులు చేసిన క్షీరసాగరమధనం లాంటిదే ఈ గోపికల నిత్యకృత్యం. మనము మధించే క్షీరసాగరం ఆ పరమాత్మ.అందలి పాలు ఆ దేవుని రూపం, గుణగణాలు. వానిని మననం చేయడమే మధించుట. దానికోసం ఆ దేవునిపై నిలిపిన పట్టుదల మంధరపర్వతం. దానికి కట్టిన తాడే మన శ్రద్ధ, ఇష్టము. ఈ మధనంలో జరిగే పోరాటంలో దైవశక్తులు జయించి మనకు భగవతుని సాన్నిధ్యం లభిస్తుంది.


నిన్నటి పాశురంలో, ఈ పాశురంలో ఎక్కువగా వినడం గురించి ప్రస్తావించారు. ఈ రెండు పాశురాలు ఆధ్యాత్మిక సాధనకు ప్రధమ సోపానమైన శ్రవణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నాయి. ఇందులో మనకు చెప్పినవి పక్షుల కలకలం, భరద్వాజ పక్షుల మాటలు. ఈ రెండూ వేదశాస్త్రాలను వినడం గురించి ప్రస్తావిస్తున్నాయి. రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖద్వని, పెరుగు చిలికే గోఫికల గాజులు, నగలు, పెరుగు సవ్వడి . వారు కనపడకున్నా ఈ శబ్దాలను బట్టి ఊహించుకోవడమన్నమాట. మూడవది మునులు, యోగులు గానం చేస్తున్న హరీహరీ అనే శబ్దం. ఇది ఆచార్యోపదేశము వంటిది.. అన్నీ ముఖ్యమైనవే. వీరు ఆ గోపికను పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు. భగవంతుని అనుగ్రహం కల్గి బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తుండగా లేదనడం తగినపని కాదు... ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావు అలా తగదమ్మా!ఏమమ్మా నీకు పిచ్చా అని వీరడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ రెండవ గోపికను నిద్రలేపి ముందుకు సాగారు..


పాశురము - 6వ రోజు

 తిరుప్పావై --- 6 పాశురం



పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్

వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో

పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు

కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి

వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం

మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం

ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


రాగం: భూపాల


పక్షులు కూసెనులే! పక్షివాహను గుడిని

తెలి సంకు పొలికేక వినలేదటే!

బాల మేలుకొనవే.. // పక్షులు //

పూతన స్తనముల విషమును పీల్చి

కపట శకటమును కాల్చాచి కూల్చి

పాల్కడలిలో యోగ నిద్రలో నున్న విష్ణుని

ఉల్లమున నిలిపి మునులు యోగులు

మెల్లగా లేచి "హరిహరీ" అని పాడ

హృదయములు కదలాడి ఆహ్లాదమును తేల

జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము.


గోదాదేవి వ్రతారంభం చేద్దామని గోపికలతో చెప్పగానే ఉదయాన్నే నిద్ర లేచారందరూ.. కాని ఇంకా పది మంది గోపికలు మేల్కొనలేదని తెలుసుకుని మరికొందరు గోపికలను తోడ్కొని వెళ్లింది. భగవంతుని ఆశ్రయించినప్పుడు మన ఒక్కరి సంకల్పము, ప్రయత్నముతోనే అది సాధ్యం కాదు. ఆ భగవంతుని సేవించే నిష్ణాతులైన వారి సహకారం తీసుకోవాలి. . మనకు సర్వాన్ని ఇచ్చే పరమాత్మను చేరడానికి యోగ్యులుగా చేసేవాడు గురువు. అతని ద్వారా ఆ స్వామిని చేరగలుగుతున్నాము. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆండాల్ తల్లి భగవదనుభవ నిష్టలైన పదిమంది గోపికలను మేల్కొలిపి, వారిని తోడ్కొని కృష్ణుని సన్నిధికి వెళ్తుంది.


ఇక్కడ మరో విషయం చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ కృష్ణుని చేరుకుందామా అని ఆత్రుతతో నిద్ర రాక ఉండవలసిన వాళ్లు అలా నిద్రపోవటమేంటి? నిద్ర అనగా అన్ని ఇంద్రియ వ్యాపారాలు మాని మనసు విశ్రాంతి తీసుకోగా ఆత్మ, పరమాత్మతో చేరి ఉంటుంది. ప్రతీ నిత్యం ప్రతీ జీవునికి సుషుప్తిలో జరిగేది ఇదే... కాని మన సుషుప్తిలో అజ్ఞానం మనను కప్పివేయడం వల్ల ఆ దివ్యానుభూతిని పొందలేకున్నాము. యోగులవలె ఆ పదిమంది గోపికలు సాత్వికమైన సుషుప్తిలో ఉన్నారు. అందరిలోకి చిన్నదైన ఉత్తిష్టను ఇలా మేల్కొలుపుతుంది గోదాదేవి. " ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు అప్పుడే లేచి కలకలలాడుతూ వెళ్తున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీమహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము స్వామి సేవకు వేళయింది రమ్మని పిలుస్తుంది. ఆ శబ్దం వినపడలేదా పిల్లా! లే ఇంకా పడుకున్నావ్.. మేము ఎవరూ లేపకుండానే లేచామనుకుంటున్నావా? పూతన స్తన్యమున విషాన్ని తాగినవాడు, శకటాసురుని కాలితో తన్ని కూల్చినవాడు, పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలో నున్న మహావిష్ణువును తమ మనసులో పదిల పరుచుకుని మునులు, యోగులు చేస్తున్న హరీ హరీ అనే సంకీర్తనాలు మా మనసులోకి చేరి మమ్మల్ని గాఢనిద్రనుండి మేల్కొలిపాయి. ఓ పిల్లా! లే! నీవు కూడా లేచి రా" అని ఆ ముగ్ధను మేల్కొలిపారు. ఆమె లేచి వారితో కలిసింది.


ఈ పాశురంలో పది మంది గోపికలు, పూతన, శకటాసురుల ప్రస్తావన వెనకల పరమార్ధం ఉంది . ఈ పాశురంలో పదిమందిని మాత్రమే మేల్కొల్పడం గల విశేషం ఏమిటంటే... విష్ణు ఆలయాలలో మూల విగ్రహంతోపాటుగా పదిమంది ఆళ్వారులను కూడా ప్రతిష్టిస్తారు. ఆలయానికి వెళ్లినప్పుడు ముందు ప్రదక్షిణం చెసి ఆల్వారులను సేవించి , ద్వజస్తంభమునకు నమస్కరించి , అమ్మవారిని సేవించిన తర్వాతే మూలవిరాట్టును సేవించడం ఆచారంగా వస్తుంది. ఆ పదుగురిని సేవించి వారి కటాక్షము మనపై పడునట్లు చేసుకోవడమే ఆ పదిమంది గోపికలను మేల్కొలపడం. పూతన వృత్తాంతము కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పుతుంది. ఈ ప్రకృతి అనే పూతన అహంకార, మమకారాలు అనే స్తనముల ద్వారా విషయ భోగాలు అనే విషాన్ని ఇచ్చి మనను చంపుతుంది కాని పోషింపదు. అందుకే అది పూత న.. పవిత్రము గానిది అని అర్ధమవుతుంది. శకటాసురుని వృత్తాంతంలో ఆ బండి మన దేహము, దాని చక్రాలు పాపపుణ్య కర్మలు, అహంకార, ఆవేశాలతో ప్రవర్తించినపుడు ఆ భగవంతుడి పాదాలు తాకినంతనే ఆ చక్రాలు విరిగిపోయి మనకు మోక్షము లభిస్తుంది.